ఎమ్మెస్కేపై ధోని ఫ్యాన్స్‌ ఫైర్‌!

27 Oct, 2018 14:44 IST|Sakshi

హైదరాబాద్‌ : భారత జట్టుకు తొలి టీ20 ప్రపంచకప్‌ను అందించిన మహేంద్ర సింగ్‌ ధోనిని వెస్టిండీస్, ఆస్ట్రేలియాలతో జరిగే టీ20 సిరీస్‌లకు ఎంపిక చేయకపోవడంపై అతని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ శుక్రవారం రాత్రి ఆలస్యంగా నాలుగు వేర్వేరు జట్లను ప్రకటించిన విషయం తెలిసిందే. విండీస్‌, ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్‌లకు ధోనిని ఎంపికచేయలేదు. ఇది అతని అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. దీంతో సోషల్‌ మీడియా వేదికగా తమ అసహనాన్ని వెల్లగక్కుతున్నారు. (చదవండి: టి20ల నుంచి ధోని ఔట్‌)

ఇక భారత్‌ టీ20లు ఆడుతున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ధోని కేవలం 11 టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడలేదు. అలాంటి ధోనిని పక్కకు పెట్టడం ఏంటని అతని అభిమానులు సెలక్షన్‌ కమిటీని నిలదీస్తున్నారు. చాలా పెద్ద తప్పు చేస్తున్నారని, ఈ నిర్ణయానికి తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరిస్తున్నారు. ‘విండీస్‌, ఆస్ట్రేలియాలతో జరిగే టీ20ల్లో ధోని ఆడబోవడం లేదు. మేము రెండో వికెట్‌ కీపర్‌ను పరీక్షించే ప్రయత్నంలో ఉన్నాం. ఈ విషయంలో పంత్, కార్తీక్‌ పోటీ పడతారు. అయితే టి20ల్లో ధోని కెరీర్‌ ముగిసిందని మాత్రం చెప్పలేను’ అని ఎమ్మెస్కే వివరణ ఇచ్చారు.  దీంతో ఎమ్మెస్కేపై సైతం ధోని అభిమానులు ఫైర్‌ అవుతున్నారు. కనీసం కెరీర్‌లో మూడు, నాలుగు మ్యాచ్‌లు కూడా ఆడని ఎమ్మెస్కే..ధోని లాంటి దిగ్గజ బ్యాట్స్‌మన్‌ గురించి నిర్ణయం తీసుకోవడం తమ కర్మని మండిపడుతున్నారు. మరికొందరు ధోని లేని లోటు ఎంటో వారికే తెలుసోస్తుందని కామెంట్‌ చేస్తున్నారు. (చదవండి: కేదర్‌ జాదవ్‌ విమర్శలు; దిగివచ్చిన బీసీసీఐ)

జట్టులో అతనికి సరైన అవకాశాలు ఇవ్వకుండా.. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ అంటూ.. అప్పుడు కెప్టెన్సీ తీసేశారనీ, ఇప్పుడు జట్టు నుంచి దూరం చేయాలనుంకుంటున్నారని ఇంకొందరు అభిప్రాయపడ్డారు. ధోనిని జట్టు నుంచి దూరం చేయడానికి జరుగుతున్న కుట్రేనని పేర్కొంటున్నారు. ఇక పుణే వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో ధోని అద్భుత క్యాచ్‌ అందుకొని ఆకట్టుకున్నాడు. ఈ క్యాచ్‌పై సైతం అతని అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఎమ్మెస్కే ఇకనైనా నీ నిర్ణయం మార్చుకో అంటూ ట్వీట్‌ చేస్తున్నారు. (చదవండి: వారెవ్వా ధోని..)

మరిన్ని వార్తలు