మా కెప్టెన్‌కు బాగా కొవ్వెక్కింది : అక్తర్‌

1 Jun, 2019 13:05 IST|Sakshi

ఇస్లామాబాద్‌ : ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లోనే పాకిస్తాన్‌ చిత్తుగా ఓడటాన్ని ఆ దేశ అభిమానులు, మాజీ క్రికెటర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. శుక్రవారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్‌ చిత్తుచిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. విండీస్‌ బౌలర్లు వరుసగా షార్ట్‌పిచ్‌ బంతులతో చెలరేగడంతో బెంబేలెత్తిపోయిన పాక్‌ 105 పరుగులకే చేతులెత్తేసి ఘోరపరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ ఓటమితో ఇప్పటికే ఆదేశ అభిమానులు పాక్‌ జట్టుపై ట్రోలింగ్‌కు మొదలుపెట్టారు. తాజాగా ఆ జట్టు మాజీ క్రికెటర్‌, రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ షోయబ్‌ అక్తర్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

‘మా కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ టాస్‌కి వస్తున్న సమయంలో.. కొవ్వు పేరుకుపోయిన అతని పొట్ట వెలుపలికి వచ్చి అసహ్యంగా కనిపించింది. నేను చూసిన మొదటి అన్‌ఫిట్‌  కెప్టెన్ అతనే. అతను తనకున్న కొవ్వుతో కనీసం కదల్లేకపోతున్నాడు. వికెట్ కీపింగ్ సమయంలోనూ ఇబ్బంది పడటం కనిపించింది’ అని అక్తర్ మండిపడ్డాడని పాక్‌ జర్నలిస్ట్‌ సాజ్‌ సాదిక్‌ పేర్కొన్నారు. ఇక అక్తర్‌ మాత్రం పాక్‌ ఆటతీరుపై మాటల్లేవ్‌ అంటూ కామెంట్‌ చేశాడు. మ్యాచ్‌ అనంతరం ‘అయ్యిందేదో అయిపోయింది.. నా ఆలోచనలు భావోద్వేగాలను మరోసారి నెమరువేసుకుంటున్నాను. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాళ్లకు మనమంతా అండగా నిలవాలి. టోర్నీ ఆసాంతం మన మద్దతు వారికి అవసరం. మ్యాచ్‌ ఓడటం మనందరిని నిరాశకు గురిచేసింది. ఇక వారిని మరింత బాధపెట్టకుండా మద్దుతుగా నిలుద్దాం’ అని ట్వీటర్‌ వేదికగా పిలుపునిచ్చాడు.

ఇక ఈ ఓటమిపై పాక్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ స్పందిస్తూ.. ఛాంపియన్స్‌ ట్రోఫీ 2017లో కూడా భారత్‌ చేతిలో తొలుత ఓడామని కానీ ఫైనల్లో గెలిచి టైటిల్‌ సాధించామని గుర్తు చేశాడు. ఈ దారుణ ఓటమి నుంచి తమ ఆటగాళ్లు కోలుకుంటారని, టైటిల్‌ పోరులో నిలుస్తారనే నమ్మకం తనకు ఉందన్నాడు. ఇంకా 8 మ్యాచ్‌లున్నాయని, రాణిస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు.


 

మరిన్ని వార్తలు