లంక క్రికెటర్‌ ధనంజయ డిసిల్వా తండ్రి హత్య 

26 May, 2018 01:23 IST|Sakshi

కొలంబో: శ్రీలంక క్రికెట్‌ జట్టు ఆల్‌రౌండర్‌ ధనంజయ డిసిల్వా తండ్రి రంజన్‌ దారుణ హత్యకు గురయ్యారు. స్థానిక రాజకీయ నాయకుడైన రంజన్‌పై గురువారం అర్ధరాత్రి కొలంబో శివారులోని రత్మలానా ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనపై విచారణ చేపడుతున్నామని, దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్‌ చేయలేదని పోలీసులు తెలిపారు.

ఈ నేపథ్యంలో వెస్టిండీస్‌ వెళ్లే శ్రీలంక జట్టు నుంచి ధనంజయ డిసిల్వా  తప్పుకున్నాడు. కాగా... లంక క్రికెట్‌ బోర్డు అతని స్థానంలో మరో ఆటగాడిని ఎంపిక చేయలేదు. ‘అతని స్థానంలో మరొకరిని తీసుకోలేదు. 17 మంది సభ్యుల బృందం ఇప్పుడు 16కు మారింది’ అని బోర్డు అధికారి తెలిపారు.  జూన్‌ 6 నుంచి శ్రీలంక–వెస్టిండీస్‌ మధ్య మూడు టెస్టుల సిరీస్‌ జరుగనుంది.   

మరిన్ని వార్తలు