ఐఎస్ఎల్: ఢిల్లీ డైనమోస్ పై గోవా విజయం

28 Dec, 2015 19:05 IST|Sakshi
ఐఎస్ఎల్: ఢిల్లీ డైనమోస్ పై గోవా విజయం

పనాజీ: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్) 2015లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్లో ఎఫ్సీ గోవా ఫుట్బాల్ జట్టు 2-0 తేడాతో ఢిల్లీ డైనమోస్పై విజయం సాధించింది. స్థానిక జవహర్ లాల్ నెహ్రూ మైదానంలో ఆడటంతో ప్రేక్షకుల మద్ధతు కూడగట్టుకున్న గోవా జట్టు చెలరేగిపోయింది. ఆట ప్రారంభమైన మూడో నిమిషంలో ఢిల్లీ  ప్లేయర్ సౌవిక్ చక్రవర్తి చేసిన తప్పిదంతో గోవా  జట్టు ఖాతా తెరిచినట్లయింది. బంతిని అడ్డుకునే ప్రయత్నంలో తానే గోల్ పోస్ట్ లోకి బంతిని నెట్టడంతో గోవా 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.

ప్రథమార్ధం చివరి నిమిషంలో స్టార్ ప్లేయర్ రీనాల్డో గోల్ చేయడంతో గోవా 2-0తో ఢిల్లీపై ఆధిక్యాన్ని మరింతగా పెంచుకుంది. చివరివరకూ గోల్ పోస్ట్లపై దాడులు చేసినప్పటికీ ఢిల్లీ మాత్రం తన ఖాతా తెరవలేకపోయింది. దీంతో గోవా జట్టు 2-0 తేడాతో ఢిల్లీపై విజయాన్ని సొంతం చేసుకుంది.
 

మరిన్ని వార్తలు