నాలుగేళ్ల తర్వాత ఫెడరర్‌..

16 Nov, 2019 09:59 IST|Sakshi

ఏటీపీ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ టోర్నీలో సెమీస్‌కు అర్హత  

లండన్‌: పురుషుల టెన్నిస్‌ సీజన్‌ ముగింపు టోర్నమెంట్‌ ఏటీపీ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌లో మాజీ చాంపియన్‌ రోజర్‌ ఫెడరర్‌ (స్విట్జర్లాండ్‌) సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. సెమీస్‌ చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఫెడరర్‌ 6–4, 6–3తో మాజీ నంబర్‌వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ (సెర్బియా)పై విజయం సాధించాడు. 2015 తర్వాత జొకోవిచ్‌ను ఓడించడం ఫెడరర్‌కిదే తొలిసారి కావడం విశేషం. తాజా గెలుపుతో 16వసారి ఏటీపీ ఫైనల్స్‌ టోర్నీలో ఫెడరర్‌ సెమీస్‌ చేరాడు. ఈ మ్యాచ్‌లో 12 ఏస్‌లు సంధించిన ఫెడరర్‌ ప్రత్యర్థి సర్వీస్‌ను మూడు సార్లు బ్రేక్‌ చేశాడు.

జొకోవిచ్‌ మాత్రం కేవలం రెండు ఏస్‌లకు మాత్రమే పరిమితమయ్యాడు. రెండో ఓటమితో జొకోవిచ్‌ ఈ టోర్నీ నుంచి నిష్క్రమించాడు. దాంతో స్పెయిన్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌ ఈ సీజన్‌ను నంబర్‌వన్‌ ర్యాంక్‌తో ముగించనున్నాడు. జొకోవిచ్‌ ఏటీపీ ఫైనల్స్‌ గ్రూప్‌ దశ నుంచే నిష్క్రమించడం 2011 తర్వాత ఇదే తొలిసారి. మరో మ్యాచ్‌లో ఐదో సీడ్‌ డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా) 6–7 (3/7), 3–6తో మాట్టియో బెరెట్టిని (ఇటలీ) చేతిలో ఓడాడు.

>
మరిన్ని వార్తలు