నాపై నమ్మకం కల్గించావు: యువీ

11 Jun, 2020 12:09 IST|Sakshi

నీతో కరాచలనం దేవుడితో చేసినట్లే ఉంది

సచిన్‌తో అనుభవాలపై యువరాజ్‌ సింగ్‌

న్యూఢిల్లీ: తాను అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి ఏడాది అయిన సందర్భంగా యువరాజ్‌ సింగ్‌ గత జ్ఞాపకాలను నెమరవేసుకున్నాడు. ప్రత్యేకంగా మాస్లర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌తో తొలినాటి అనుభవాలను షేర్‌ చేసుకున్నాడు. సచిన్‌ను తొలిసారి కలిసిన సందర్భంలో కరాచలనం చేస్తే అది దేవుడితో చేసినట్లే అనిపించిందని యువీ పేర్కొన్నాడు. తన శక్తి సామర్థ్యాలను గుర్తించి, వెన్నంటి ప్రోత్సహించిన సచిన్‌కు ఈ సందర్భంగా యువీ ధన్యవాదాలు తెలిపాడు. ప్రధానంగా తాను క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు సచిన్‌ చేసిన సహకారం మరువలేనిదని యువరాజ్‌ సింగ్‌ వెల్లడించాడు. ‘నేను సచిన్‌ను తొలిసారి కలిసి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చినప్పుడు సరికొత్త అనుభూతి కల్గింది. ఆ దేవుడితోనే కరాచలనం చేస్తున్నట్లు ఫీలయ్యా. నేను కఠిన సమయాన్ని ఎదుర్కొన్నప్పుడు నువ్వు మార్గ నిర్దేశం చేసిన తీరు ఎప్పటికీ నాకు గుర్తే. నా టాలెంట్‌ను గుర్తించి ప్రోత్సహించావ్‌ మాస్టర్‌’ అని యువీ తెలిపాడు. (ఐపీఎల్‌కు సిద్ధంగా ఉండండి: గంగూలీ)

అంతకుముందు యువీతో తొలి జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటూ సచిన్‌ స్పందించాడు. ‘ యువీ రిటైర్మెంట్‌ ప్రకటించి ఏడాది పూర్తయ్యింది. చెన్నై క్యాంప్‌లో యువీతో నా తొలి జ్ఞాపకం. అప్పుడు యువీకి నేను ఏమీ సాయం చేయలేకపోయా.. కానీ అతనొక గ్రేట్‌ అథ్లెట్‌ అనే విషయాన్ని గుర్తించాను. అతని హిట్టింగ్‌ సామర్థ్యం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అతను ఎంత పెద్ద హిట్టర్‌ అనే విషయం ప్రపంచం చూసింది’ అని సచిన్‌ ట్వీట్‌ చేశాడు. దానికి ప్రతిగా స్పందించిన యువీ.. సచిన్‌తో తనకు ఎదురైన అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు. అదే సమయంలో ఫ్యాన్స్‌ కురిపించిన ప్రేమ, అభిమానం ఎప్పటికీ పదిలమేనని యువీ తెలిపాడు. ఈ రోజు తనకు ప్రత్యేకంగా నిలిచిందంటే అందుకు అభిమానుల సహకారం కూడా ఒక కారణమన్నాడు.  తన ఆటపై నమ్మకం ఉంచిన అభిమానులకు ఎప్పుడూ రుణపడి ఉంటానన్నాడు. 

>
మరిన్ని వార్తలు