షోయబ్‌ అక్తర్‌కు సమన్లు

4 Jun, 2020 14:18 IST|Sakshi

కరాచీ: పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) లీగల్‌ అడ్వైజర్‌ తఫాజ్జుల్‌ రిజ్వి అసమర్థుడని సంచలన వ్యాఖ్యలు చేసిన ఆ దేశ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌కు ఫెడరల్‌ ఇన్విస్టిగేషన్‌ ఏజెన్సీ(ఎఫ్‌ఐఏ) సమన్లు జారీ చేసింది. రిజ్విపై అక్తర్‌ చేసిన వ్యాఖ్యలపై విచారణకు సిద్ధమైన ఎఫ్‌ఐఏ.. ముందుగా సమన్లు పంపింది. శుక్రవారం అక్తర్‌ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసిన తర్వాత విచారణను చేపట్టనున్నట్లు పేర్కొంది. ‘ ఇంకా అక్తర్‌పై ఎటువంటి కేసు నమోదు చేయలేదు. అతని యూట్యూబ్‌ చానల్‌లో రిజ్విని దూషించిన క్రమంలో ఫిర్యాదు అందింది. దాంతో అక్తర్‌కు సమన్లు జారీ చేశాం. అక్తర్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలా.. వద్దా అనేది స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసుకున్నాక పరిశీలిస్తాం’అని ఒక అధికారి తెలిపారు.(బాల్కనీ నుంచి దూకేద్దామనుకున్నా: ఊతప్ప)

తనపై అసభ్య పదజాలం వాడటమే కాకుండా న్యాయపరమైన అంశాల్లో అక్తర్‌ తలదూర్చిందుకు గాను అతనిపై పరువు నష్టం దావా వేశాడు రిజ్వి. ఈ క్రమంలోనే 100 మిలియన్లు పాకిస్తాన్‌ కరెన్సీ చెల్లించాలంటూ అందులో పేర్కొన్నాడు. అవినీతి ఆరోపణల్లో భాగంగా పాకిస్తాన్‌ వెటరన్‌ క్రికెటర్‌ ఉమర్‌ అక్మల్‌పై మూడేళ్లు నిషేధం విధించిన సందర్భంలో పీసీబీ లీగల్‌ డిపార్ట్‌మెంట్‌పై అక్తర్‌ అసంబద్ధ వ్యాఖ్యలు చేశాడు. తూ తన యూట్యూబ్‌ చానల్‌లో వీడియోను విడుదల చేశారు. ప్రధానంగా మూడేళ్ల నిషేధాన్ని తప్పుబట్టాడు. ఇది పీసీబీ లీగల్‌ అడ్వైజరీ అసమర్థవత వల్లే ఉమర్‌కు మూడేళ్ల శిక్ష పడిందంటూ వ్యాఖ్యానించాడు. అదే సమయంలో రిజ్విపై ఆరోపణలు చేశాడు. చాలా సున్నితమైన అంశాల్లో రిజ్వికి అనుభవం లేదంటూ విమర్శించాడు. పీసీబీ లీగల్‌ డిపార్ట్‌మెంట్‌ అనేది కుళ్లిన టెంక అంటూ విమర్శలు చేశాడు. పీసీబీ అండదండలు ఉన్న కారణంగానే రిజ్వి సుదీర్ఘ కాలం లీగల్‌ అడ్వైజర్‌గా కొనసాగుతున్నాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. దాంతో అక్తర్‌పై పరువు నష్టం కేసును రిజ్వి దాఖలు చేశాడు. (ముగ్గురు క్రికెటర్లపై ఫిక్సింగ్‌ ఆరోపణలు)

మరిన్ని వార్తలు