విజయమే లక్ష్యంగా బరిలోకి...

15 Jun, 2015 23:57 IST|Sakshi

గ్వామ్ జట్టుతో భారత్ పోరు నేడు
  ‘ఫిఫా’ వరల్డ్ కప్ క్వాలిఫయింగ్
 
 హగట్నా (గ్వామ్): తొలి మ్యాచ్‌లో పోరాడి ఓడిన భారత ఫుట్‌బాల్ జట్టు విజయమే లక్ష్యంగా గ్వామ్ జట్టుతో పోటీకి సిద్ధమైంది. 2018 ‘ఫిఫా’ ప్రపంచకప్ ఆసియా జోన్ క్వాలిఫయింగ్ గ్రూప్ ‘డి’లో భాగంగా మంగళవారం ఈ పోరు జరుగనుంది. తొలి మ్యాచ్‌లో తుర్క్‌మెనిస్తాన్‌పై 1-0తో సంచలన విజయం సాధించి జోరుమీదున్న గ్వామ్ జట్టును భారత్ తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. తమకంటే మెరుగైన ర్యాంక్‌గల ఒమన్ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 1-2 గోల్స్ తేడాతో ఓడినప్పటికీ చివరిదాకా పోరాటపటిమ కనబరిచి అందర్నీ ఆకట్టుకుంది.
 
  ఈ మ్యాచ్‌లోనూ అదే ఉత్సాహంతో ఆడాలనే పట్టుదలతో ఉన్న భారత్ బోణీ కొట్టడంపై దృష్టి సారించింది. కోచ్ స్టీఫెన్ కాన్‌స్టన్‌టైన్ కెప్టెన్ రొటేషన్ పాలసీలో భాగంగా ఈ మ్యాచ్‌లో స్టార్ ఫార్వర్డ్ సునీల్ చెత్రీ భారత్‌కు నాయకత్వం వహించనున్నాడు. ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్నబ్ మండల్ భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు.  గ్వామ్ జట్టుతో చివరిసారి 2014 ఏఎఫ్‌సీ చాలెంజ్ కప్‌లోఆడిన భారత్ ఆ మ్యాచ్‌లో 4-0 గోల్స్ తేడాతో గెలిచింది. ఈసారీ అదే ఫలితాన్ని పునరావృతం చేయాలనే లక్ష్యంతో టీమిండియా ఆటగాళ్లున్నారు.
 

మరిన్ని వార్తలు