తీవ్ర ఒత్తిడిలో ఇంగ్లండ్‌

12 Sep, 2019 03:28 IST|Sakshi

నేటి నుంచి యాషెస్‌ ఐదో టెస్టు  

లండన్‌: కొంత ప్రతిఘటన ఎదుర్కొన్నా సిరీస్‌ ట్రోఫీని నిలబెట్టుకున్న ఆస్ట్రేలియా... ఇప్పుడు యాషెస్‌ను పూర్తి ఆధిక్యంతో కైవసం చేసుకోవడంపై దృష్టి సారించింది. ఇదే సమయంలో గురువారం నుంచి ఆరంభమయ్యే చివరిదైన ఐదో టెస్టు ఇంగ్లండ్‌కు ప్రాణ సంకటంగా మారింది. ప్రస్తుతం 1–2తో వెనుకబడి ఉన్న ఆతిథ్య జట్టు ఆఖరి మ్యాచ్‌లోనైనా నెగ్గి సొంతగడ్డపై పరువు దక్కించుకోవాలని భావిస్తోంది. జోరు మీదున్న కంగారూలను ముఖ్యంగా మాజీ కెపె్టన్‌ స్టీవ్‌ స్మిత్‌ను నిలువరిస్తేనే ఇంగ్లండ్‌ కోరిక నెరవేరే వీలుంది. ఇప్పటికే తుది జట్టును ప్రకటించిన ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మన్‌ జేసన్‌ రాయ్‌పై వేటు వేసి ఆల్‌రౌండర్‌ స్యామ్‌ కరన్‌కు చోటిచి్చంది. ఓవర్టన్‌ను తప్పించి క్రిస్‌ వోక్స్‌ను తీసుకుంది. ఆసీస్‌ సైతం బ్యాట్స్‌మన్‌ ట్రావిస్‌ హెడ్‌ను పక్కనపెట్టి ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ను ఆడించనుంది. ఎడంచేతి వాటం పేసర్‌ స్టార్క్‌ స్థానంలో సిడిల్‌ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ టెస్టులోనూ విజయం సాధిస్తే 2001 తర్వాత ఆ్రస్టేలియా... ఇంగ్లండ్‌ గడ్డపై యాషెస్‌ను గెలిచినట్లవుతుంది. 

స్మిత్‌ వీరగాథ; వార్నర్, రూట్‌ వైఫల్యాల బాధ
పరుగులు 671... సగటు 134.20... ఐదు ఇన్నింగ్స్‌ల్లో స్మిత్‌ ప్రదర్శన ఇది. ఇదే ఊపులో అతడు టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి సైతం ఎగబాకాడు. సిరీస్‌లో రెండు జట్ల మధ్య ప్రధాన తేడా స్మిత్‌ అని దీంతోనే తెలిసిపోతోంది. తోడుగా లబషేన్, అడపాదడపా వేడ్, కెపె్టన్‌ పైన్, లోయరార్డర్‌ రాణిస్తుండటంతో ఆసీస్‌ గట్టెక్కుతోంది. ఓపెనర్‌ వార్నర్‌ (మొత్తం 79 పరుగులు) అధ్వాన ఫామ్‌ నుంచి బయటపడితే వారి బ్యాటింగ్‌ మరింత బలోపేతం అవుతుంది. సిరీస్‌లో ఉమ్మడిగా 42 వికెట్లు పడగొట్టిన కమిన్స్‌–హాజల్‌వుడ్‌ పేస్‌ ద్వయాన్ని ఎదుర్కొనాలంటే ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌కు శక్తికి మించి పోరాడక తప్పేలా లేదు. 

జట్టుకు మూలస్తంభమైన కెప్టెన్‌ రూట్‌ పరుగులు సాధిస్తే మిగతావారిలోనూ ఆత్మవిశ్వాసం వస్తుంది. అయితే, అతడే ఫామ్‌ వెదుకులాటలో ఉండటం ఇంగ్లండ్‌ను దెబ్బతీస్తోంది. గాయంతో బాధపడుతున్న స్టోక్స్‌ బ్యాటింగ్‌కే పరిమితం కానున్నాడు. కరన్‌ రూపంలో నాణ్యమైన ఆల్‌రౌండర్‌ చేరిక జట్టు రాతను మార్చే వీలుంది. పేసర్లు బ్రాడ్, ఆర్చర్‌ మరింత పకడ్బందీగా బంతులేసి... బ్యాటింగ్‌లో బట్లర్, బెయిర్‌స్టో విలువైన ఇన్నింగ్స్‌ ఆడితేనే ఇంగ్లండ్‌కు గెలుపు అవకాశాలుంటాయి. లేదంటే ఐదేళ్ల తర్వాత స్వదేశంలో ప్రత్యర్థి జట్టుకు సిరీస్‌కు కోల్పోతుంది. 2014లో ఆ జట్టు శ్రీలంక చేతిలో 1–0తో పరాజయం పాలైంది.

మరిన్ని వార్తలు