దూరం మరచి... వైరం పెరిగి...

21 Apr, 2020 01:13 IST|Sakshi

మైదానంలోనే కొట్టుకున్న చైనీస్‌ తైపీ బేస్‌బాల్‌ ఆటగాళ్లు  

చైనీస్‌ తైపీ: కరోనా కారణంగా స్టేడియంలో ఆటగాళ్లే ఉన్నారు. ప్రేక్షకుల్ని అనుమతించలేదు. ఈలగోలల్లేని మైదానంలో ఎంచక్కా ఆడుకోవాల్సిన ఆటగాళ్లు దెబ్బలాడుకున్నారు. ఈ తగువులాటలో భౌతిక దూరం సంగతే మరిచారు. మ్యాచ్‌ ప్రసారం కావాల్సిన టీవీల్లో కొట్లాట ‘ప్రత్యక్ష’ ప్రసారమైంది. చైనీస్‌ తైపీ బేస్‌బాల్‌ లీగ్‌లో భాగంగా ఆదివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. రకుటెన్‌ మంకీస్, ఫుబొన్‌ గార్డియన్స్‌ జట్ల మధ్య బేస్‌బాల్‌ మ్యాచ్‌ ప్రేక్షకుల్లేకుండా జరిగినా ... ఇరుజట్ల ఆటగాళ్ల తగవుతో అల్లరిపాలైంది. భౌతిక దూరం పాటించాలనే ఉద్దేశంతో ఎవరినీ అనుమతించని స్టేడియంలో... విచక్షణ మరిచి ఒకరిమీద ఒకరుపడి మరీ కొట్టుకోవడం తైపీ వర్గాల్ని కలవరపెట్టింది. ఇక ఈ ద్వీప దేశం బేస్‌బాల్‌ తగవుతో వార్తల్లోకెక్కినా... ప్రపంచాన్నే వణికిస్తున్న వైరస్‌నే పకడ్బందీ చర్యలతో కట్టడి చేసిన దేశంగా కితాబులందు కుంటోంది.

మరిన్ని వార్తలు