శుభ సన్నాహం...

30 Nov, 2018 04:11 IST|Sakshi
హనుమ విహారి

భారత్‌ 358 ఆలౌట్‌

కోహ్లి, పృథ్వీ షా, పుజారా, విహారి, రహానే అర్ధ సెంచరీలు

సీఏ ఎలెవన్‌తో ప్రాక్టీస్‌ మ్యాచ్‌

సిడ్నీ: ఆస్ట్రేలియా గడ్డపై భారత బ్యాట్స్‌మెన్‌కు మంచి మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లభించింది. క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) ఎలెవన్‌తో జరుగుతోన్న నాలుగు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో ఐదుగురు బ్యాట్స్‌మెన్‌ అర్ధ శతకాలతో మెరిశారు. ఫలితంగా భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 92 ఓవర్లలో 358 పరుగులకు ఆలౌటైంది. వర్షం కారణంగా తొలి రోజు ఆట పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా... గురువారం రెండో రోజు టాస్‌ ఓడిన భారత్‌ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్‌ లోకేశ్‌ రాహుల్‌ (3) మరోసారి నిరాశపరిచాడు. దీంతో టీమిండియా 16 పరుగులకే తొలి వికెట్‌ కోల్పోయింది. ఈ దశలో చతేశ్వర్‌ పుజారా (54; 6 ఫోర్లు)తో కలిసి యువ ఓపెనర్‌ పృథ్వీ షా (69 బంతుల్లో 66; 11 ఫోర్లు) చెలరేగాడు. పుజారాతో కలిసి రెండో వికెట్‌కు 80 పరుగులు జోడించాక ఔటయ్యాడు.

అనంతరం ఇన్నింగ్స్‌ నడిపించే బాధ్యత కెప్టెన్‌ కోహ్లి (87 బంతుల్లో 64; 7 ఫోర్లు, సిక్స్‌) తీసుకున్నాడు. అతను  పుజారాతో కలిసి మూడో వికెట్‌కు 73 పరుగులు జతచేశాడు. ఆంధ్ర ఆటగాడు హనుమ విహారి (88 బంతుల్లో 53; 5 ఫోర్లు), రహానే (123 బంతుల్లో 56 రిటైర్డ్‌ ఔట్‌; 1 ఫోర్‌) కూడా అర్ధ శతకాలు చేయడంతో భారత్‌ 347/5తో పటిష్ట స్థితిలో నిలిచింది. ఆ తర్వాత రోహిత్‌ శర్మ (40; 5 ఫోర్లు, సిక్స్‌), అశ్విన్‌ (0), షమీ (0), ఉమేశ్‌ (0) వెంటవెంటనే ఔటవడంతో... 11 పరుగుల వ్యవధిలో చివరి ఐదు వికెట్లు కోల్పోయింది. పంత్‌ (11 నాటౌట్‌) అజేయం గా నిలిచాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన సీఏ ఎలెవన్‌ ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 24 పరుగులు చేసింది.

మరిన్ని వార్తలు