పుల్లెల గాయత్రికి టాప్‌ సీడింగ్‌

21 May, 2019 10:10 IST|Sakshi

ఆలిండియా జూనియర్‌ ర్యాంకింగ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌  

చెన్నై: యోనెక్స్‌ సన్‌రైజ్‌ ఆలిండియా జూనియర్‌ ర్యాంకింగ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ క్రీడాకారిణి పుల్లెల గాయత్రికి టాప్‌ సీడింగ్‌ దక్కింది. నేటి నుంచి ఇక్కడ జరుగనున్న ఈ టోర్నమెంట్‌లో దేశంలోని నలుమూలల నుంచి మొత్తం 1000 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. అండర్‌–19 కేటగిరీ బాలికల సింగిల్స్‌లో తలపడనున్న 16 ఏళ్ల గాయత్రికి ఈ టోర్నీలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఆకర్షి కశ్యప్‌ నుంచి పోటీ ఎదురవనుంది. త్వరలో చైనా వేదికగా జరిగే జూనియర్‌ ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌కు క్వాలిఫయింగ్‌ టోర్నీగా ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. ఇందులో సత్తా చాటేందుకు వీరిద్దరితో పాటు మాళవిక బన్సోద్, ఉన్నతి బిష్త్‌ సిద్ధమయ్యారు. బాలుర విభాగంలో మధ్యప్రదేశ్‌ క్రీడాకారుడు ప్రియాన్షు రజావత్‌ టాప్‌సీడ్‌గా బరిలో దిగనున్నాడు.

మణిపూర్‌కు చెందిన మైస్నమ్‌ మీరాబా, చెన్నై క్రీడాకారుడు శంకర్‌ ముత్తుస్వామితో పాటు సాయిచరణ్‌ కోయ, కె. సతీశ్‌ కుమార్, ఆకాశ్‌ యాదవ్‌ ఈ టోర్నీలో వారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. బాలుర డబుల్స్‌ విభాగంలో మంజిత్‌ సింగ్‌–డింకూ సింగ్‌ జంట... బాలికల డబుల్స్‌లో త్రిషా జోలీ–వర్షిణి జోడీ... మిక్స్‌డ్‌ డబుల్స్‌ కేటగిరీలో తెలంగాణకు చెందిన నవనీత్‌ బొక్కా–సాహితి బండి జంటలు టాప్‌ సీడ్‌లుగా బరిలో దిగనున్నాయి. మెరుగైన ర్యాంకుల్లో ఉన్న 32 మంది సింగిల్స్‌ క్రీడాకారులు మెయిన్‌డ్రాకు నేరుగా అర్హత పొందారు. క్వాలిఫయింగ్‌ పోటీల్లో 500కు పైగా బాలురు, 220 మంది బాలికలు తలపడనున్నారు. 

మరిన్ని వార్తలు