హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయిలో క్రీడలను ప్రోత్సహిస్తూ క్రీడాకారులకు గుర్తింపు తీసుకువచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్సీ, రాష్ట్ర ఫుట్బాల్ టెన్నిస్ సంఘం అధ్యక్షుడు టి.భాను ప్రసాద్రావు అన్నారు. వనస్థలిపురంలోని జీఎంఆర్ టెన్నిస్ అకాడమీలో రెండు రోజులపాటు జరుగనున్న సౌత్ జోన్ సీనియర్ ఫుట్బాల్ టెన్నిస్ చాంపియన్షిప్ను శనివారం ఆయన ఐఆర్ఏఎస్ అధికారి కేశవ్తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1920లో మొదటిసారిగా నిర్వహించిన ఫుట్బాల్ టెన్నిస్ క్రీడని నేడు హైదరాబాద్లో నిర్వహించడం గర్వకారణమన్నారు. తెలంగాణలో అన్ని జిల్లాలకు ఈ క్రీడను విస్తరించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ పోటీల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, గోవా, పాండిచ్చేరిలకు చెందిన క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా భారత అండర్–17 జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన టెన్నిస్ క్రీడాకారిణి జి. సౌమ్యకు వోర్టెక్స్ స్పోర్టింగ్ డైరెక్టర్ రజని రూ. 10 వేల నగదును బహుమతిగా అందజేశారు.