బుడాపెస్ట్: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సుప్రీం కోర్టు పరిపాలక కమిటీ (సీఓఏ) చేతుల్లోకి వెళ్లినట్లే భారత్కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ ఫార్ములావన్ జట్టు లండన్ కోర్టు చేతుల్లోకి వెళ్లింది. దీంతో ఈ టీమ్ యజమాని విజయ్ మాల్యా కష్టాలు మరింత పెరిగాయి. ఆయన టీమ్ వ్యవహారాలను హైకోర్టు నియమించిన పరిపాలకుడు పర్యవేక్షించనున్నట్లు ‘ఫోర్స్ ఇండియా’ టీమ్ డిప్యూటీ ప్రిన్సిపాల్ బాబ్ ఫెర్న్లీ వెల్లడించారు. ఈ జట్టు పెట్టుబడుల్లో పెట్టిన నగదు నిల్వలకు సంబంధించి ఆర్థిక అవకతవకలు జరిగినట్లు తేలడంతో కేసును లండన్ కోర్టు విచారిస్తోంది. ఫోర్స్ ఇండియా సీనియర్ డ్రైవర్ పెరెజ్ మాట్లాడుతూ జట్టు పరిస్థితి క్లిష్టంగా ఉందని చెప్పారు. మరో డ్రైవర్ ఒకాన్ ఈ జట్టును వదిలి రెనౌ జట్టుతో ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధమయ్యాడు.