కరోనాతో మాజీ క్రికెటర్‌ మృతి

29 Jun, 2020 15:53 IST|Sakshi

సాయం చేయమంటూ వేడుకున్న గంభీర్‌

ప్లాస్మా థెరఫీ చేయించినా ఫలితం శూన్యం

ఢిల్లీ: కరోనా వైరస్‌ బారిన పడి ఢిల్లీ మాజీ క్రికెటర్‌ సంజయ్‌ దోబల్‌ మృతిచెందారు. సోమవారం ఉదయం సంజయ్‌ మృతి చెందిన విషయాన్ని ఆయన కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉన్న ఒకరు తెలిపారు. 53 ఏళ్ల సంజయ్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరు కుమారుల్లో పెద్ద కుమారుడు సిదాంత్‌ రాజస్తాన్‌​ తరఫున ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఆడుతుండగా, చిన్న కుమారుడు ఎకాన్ష్‌ అండర్‌-23 జట్టులో ఢిల్లీ తరుఫున అరంగేట్రం చేశాడు. కాగా, క్లబ్‌ క్రికెట్‌లో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన సంజయ్‌ దోబల్‌.. ఢిల్లీ అండర్‌-23 జట్టుకు సపోర్టింగ్‌ స్టాప్‌కు కూడా సేవలందించారు. ఇటీవల కరోనా వైరస్‌ సోకింది. దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స తీసుకుంటున్న క్రమంలో సంజయ్‌ కరోనా బారిన పడ్డారు.(‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌’లోగోకు ఐసీసీ ఓకే!)

మూడు వారాల క్రితమే కరోనా లక్షణాలు కనిపించగా, ఆదివారం ఆయన పరిస్థితి విషమించింది. ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడంతో వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. మరొకవైపు ప్లాస్మా థెరఫీ కూడా చేయించినా ఫలితం లేకుండా పోయిందని ఆయన సన్నిహితుడు ఒకరు తెలిపారు. సంజయ్‌ మృతిపై ఢిల్లీ క్రికెట్‌ అసోసియేషన్‌ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఆయన అకాల మరణం కలవరపాటుకు గురిచేసిందని డీడీసీఏ సెక్రటరీ వినోద​్‌ తిహారా ఆవేదన వ్యక్తం చేశారు. డీడీసీఏ తరఫున సంజయ్‌కు నివాళులు అర్పించిన వినోద్‌.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సంజయ్‌కు రంజీ ట్రోఫీ ఆడిన అనుభవం లేకపోయినా జూనియర్‌ క్రికెటర్లతో మంచి సాన్నిహిత్యం కల్గి ఉండేవాడు. ఆ క్రమంలోనే గౌతం గంభీర్‌తో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఆయన ఎక్కువగా ఎయిర్‌ ఇండియా తరఫున ఎక్కువ మ్యాచ్‌లు ఆడాడు. మరొకవైపు సోనెట్‌ క్రికెట్‌ క్లబ్‌ తరఫున ఆడిన అనుభవం కూడా సంజయ్‌కు‌ ఉంది.

గంభీర్‌ అప్పీల్‌
సంజయ్‌ పరిస్థితి విషమించిన క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్‌, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్‌ ప్లాస్మా థెరఫీ కోసం అప్పీల్‌ చేశారు. తన స్నేహితుని సంజయ్‌ కోసం డోనర్‌ కావాలంటూ ట్వీటర్‌ వేదికగా విజ్ఞప్తి చేశారు. కాగా, ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) ఎంఎల్‌ఏ దిలీప్‌ పాండే.. సంజయ్‌కు డోనర్‌ను ఏర్పాటు చేసినా అది సత్ఫలితాన్ని ఇవ్వలేదు. (‘బుమ్రా నో బాల్‌ కొంపముంచింది’)

మరిన్ని వార్తలు