-

మళ్లీ కోచ్‌గా కుంబ్లే రీ-ఎంట్రీ?

6 Sep, 2018 15:41 IST|Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కోచ్‌ అనిల్‌ కుంబ్లే మరోసారి కోచింగ్ బాధ్యతలు స్వీకరించనున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. అయితే, ఈసారి అనిల్ కుంబ్లే బాధ్యతలు నిర్వహించేది టీమిండియాకు కాదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో జట్టు అయిన ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు కోచింగ్‌ సేవలు అందించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఈ వార్తలపై ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ యాజమాన్యం సైతం స్పందించింది. వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ సీజన్ కోసం టీమిండియా మాజీ కోచ్‌ అనిల్‌ కుంబ్లేతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఢిల్లీ ఫ్రాంఛైజీ ఓనర్లలో ఒకరైన పార్థ్ జిందాల్ వెల్లడించినట్లు అహ్మదాబాద్ మిర్రర్ తన కథనంలో పేర్కొంది. ‘వచ్చే ఏడాది ఐపీఎల్‌ సీజన్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ జట్టుకు మెంటార్‌గా బాధ్యతలు నిర్వహించాలని కుంబ్లేను కోరుతున్నాం. దీనిపై కుంబ్లే ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఒకవేళ కుంబ్లే మా జట్టులో కలిస్తే ఎంతో అదృష్టంగా భావిస్తాం’ అని వారు తెలిపారు. కుంబ్లేను మెంటార్‌గా ఎంచుకోవాలని భారత క్రికెట్‌ జట్టు మాజీ సారథి సౌరభ్‌ గంగూలీనే ఢిల్లీ యాజమాన్యానికి సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. కుంబ్లే గనుక ఢిల్లీ జట్టుకు మెంటార్‌‌గా బాధ్యతలు అందుకుంటే, మరోసారి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌తో కలిసి పని చేసినట్లు అవుతుంది.

గతంలో అనిల్ కుంబ్లే-రికీ పాంటింగ్‌ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ జట్టుకు కలిసి పని చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, వచ్చే ఏడాది మార్చి 29 నుంచి మే 19 వరకు ఐపీఎల్‌ టోర్నీ జరగనున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది జూన్‌లో ఇంగ్లండ్ వేదికగా వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో వచ్చే ఏడాది ఐపీఎల్‌ కాస్త ముందుగానే నిర్వహించనున్నారు.

మరిన్ని వార్తలు