నిషేధాన్ని తొలగించండి

31 Mar, 2018 04:32 IST|Sakshi

‘సుప్రీం’లో రాజ్‌కుంద్రా పిటిషన్‌

 కోల్‌కతా: రాజస్తాన్‌ రాయల్స్‌ మాజీ సహ యజమాని రాజ్‌కుంద్రా తను క్రికెట్‌ కార్యకలాపాల్లో పాల్గొనకుండా విధించిన నిషేధాన్ని తొలగించాలని సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. 2013 సీజన్‌ ఐపీఎల్‌లో ఫిక్సింగ్, బెట్టింగ్‌ ఉదంతంలో రాజ్‌కుంద్రాతో పాటు చెన్నై జట్టుకు చెందిన గురునాథ్‌ మయ్యప్పన్‌లను కోర్టు దోషులుగా తేల్చింది. దీంతో బీసీసీఐ వీరిద్దరిపై జీవితకాల నిషేధం విధించింది. అయితే కుంద్రా ఇటీవల ఢిల్లీ పోలీసులను సమాచార హక్కు చట్టం ద్వారా సంప్రదించగా... బెట్టింగ్‌కు పాల్పడినట్లు తనపై ఎలాంటి సాక్షాధారాలు లభించలేదని సదరు వర్గాలు తెలిపాయి.

దీంతో తాను నిర్దోషినని క్రికెట్‌ కార్యకలాపాల్లో పాల్గొనేందుకు అవకాశమివ్వాలని రాజ్‌కుంద్రా అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెట్టింగ్‌ను చట్టబద్దం చేయాలన్నాడు. ‘దేశంలో చాలామంది బెట్టింగ్‌ చేస్తున్నారు. మ్యాచ్‌లపై బెట్టింగ్‌ లేకుంటే 80 శాతం మంది ప్రజలు క్రికెట్‌ చూడటం మానేస్తారు. ఇది గ్యారెంటీ! ఒక మ్యాచ్‌పై రూ 4000 నుంచి 5000 కోట్ల బెట్టింగ్‌ జరుగుతోంది. దీన్ని చట్టబద్ధం చేస్తే పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది’ అని రాజ్‌కుంద్రా అభిప్రాయ పడ్డాడు.

మరిన్ని వార్తలు