2023 నుంచి నాలుగు రోజుల టెస్టులు?

31 Dec, 2019 01:11 IST|Sakshi

మెల్‌బోర్న్‌: మరో మూడేళ్ల తర్వాత నాలుగు రోజుల టెస్టులే కనిపించే అవకాశముంది. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) సంప్రదాయ క్రికెట్‌ను తప్పనిసరిగా కుదించాలనే యోచనలో ఉంది. అంతా అనుకున్నట్లు జరిగితే 2023 నుంచి ఐదు రోజుల ఆట కాస్తా నాలుగు రోజులకే పరిమితం కానుంది. ఈ కుదింపు మరిన్ని ఈవెంట్లకు అవకాశమిస్తుందని ఐసీసీ భావిస్తోంది. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ద్వైపాక్షిక సిరీస్‌లు పెరగాలని గతంలో డిమాండ్‌ చేసింది. అయితే వివిధ దేశాల్లో టి20 లీగ్‌లు జరుగుతుండటం వల్లే టెస్టులను కుదిస్తున్నారని తెలిసింది. ఇది కొత్తగా ఇప్పుడే వచ్చిన మార్పు కాదు... ఇదివరకే ఈ ఏడాది ఇంగ్లండ్, ఐర్లాండ్‌ల మధ్య నాలుగు రోజుల టెస్టు జరిగింది. 2017లోనూ దక్షిణాఫ్రికా, జింబాబ్వేలు నాలుగు రోజుల మ్యాచ్‌ ఆడాయి.

ఇపుడే స్పందిస్తే తొందరపాటే: గంగూలీ 
నాలుగు రోజుల టెస్టుకు ఇంకా చాలారోజులు పడుతుందని దీనిపై ఇప్పుడే స్పందిస్తే తొందరపాటే అవుతుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ అన్నాడు. ‘ముందు ప్రతిపాదన రానివ్వండి. రాకముందే వ్యాఖ్యానించడం తగదు’ అని చెప్పాడు.

మరిన్ని వార్తలు