టీమిండియాలో నాలుగో స్థానం అతడిదేనా?

29 May, 2019 12:17 IST|Sakshi

నాలుగో స్థానంలో రాహుల్‌కు అవకాశం

ప్రాక్టీస్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై శతకం

కార్డిఫ్‌: ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్‌లో నాలుగో స్థానంలో ఎవరిని ఆడించాలన్న అంశంపై టీమిండియాలో నెలకొన్న ఉత్కంఠ వీడింది. నిన్న బంగ్లాదేశ్‌తో జరిగిన ప్రాక్టీస్‌ మ్యాచ్‌తో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఓ క్లారిటీ వచ్చేసినట్లు తెలుస్తోంది. రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌‌పై శతకం బాదిన కేఎల్ రాహుల్ (108)ను నాలుగో స్థానంలో ఆడించాలని కెప్టెన్‌తో పాటు టీం మేనేజిమెంట్ భావిస్తోంది. అద్భుతమైన ఇన్నింగ్స్‌తో కేఎల్ రాహుల్ రాణించడంతో రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో కోహ్లీసేన బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే. అయితే మిడిల్‌ ఆర్డర్‌లో కీలకమైన నాలుగో స్థానంపై గతకొంత కాలంగా తీవ్ర చర్చ జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ స్థానం కోసం ఏడాది ముందు నుంచే దినేష్‌ కార్తిక్‌, కేఎల్‌ రాహుల్‌, రిషబ్‌ పంత్‌, అంబటి రాయుడులను ప్రయోగించారు.

గత కొంత కాలంగా రాయుడు ఫామ్‌ లేక సతమతవుతుండడంతో ఆ స్థానంలో రాహుల్‌ను ఎంచుకుంది టీమిండియా. దీనిలో భాగంగానే కీలకమైన ప్రపంచ కప్‌ ముందు జరిగిన ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో వ్యూహత్మకంగా రాహుల్‌ను నాలుగో స్థానంలో ఆడించి విజయం సాధించింది. దీంతో ఎంతో కాలంగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడినట్లయింది. నాలుగో స్థానంలో కేఎల్ రాహుల్ శతకం బాదడం జట్టుకు పెద్ద ఊరటగా మ్యాచ్ అనంతరం కోహ్లీ ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ధోనీ, హార్దిక్ కూడా రాణించారని కితాబిచ్చాడు. కాగా బంగ్లాదేశ్‌పై కోహ్లీసేన 95 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. మ్యాచ్‌లో రాహుల్‌తో పాటు ధోనీ (113; 78 బంతుల్లో) సెంచరీ సాధించాడు. 

మరిన్ని వార్తలు