జపాన్‌కు షాక్‌ ఇచ్చి...

4 Nov, 2017 00:29 IST|Sakshi

డిఫెండింగ్‌ చాంపియన్‌పై భారత మహిళల విజయం

నాలుగోసారి ఆసియా కప్‌ హాకీ టోర్నీ ఫైనల్లోకి

కకమిగహర (జపాన్‌): ప్రత్యర్థి ఎవరైనా ఏమాత్రం బెదరకుండా ఆడుతోన్న భారత మహిళల హాకీ జట్టు ఆసియా కప్‌లో తమ విజయపరంపరను కొనసాగిస్తోంది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో రాణి రాంపాల్‌ నేతృత్వంలోని భారత జట్టు 4–2 గోల్స్‌ తేడాతో డిఫెండింగ్‌ చాంపియన్‌ జపాన్‌ను బోల్తా కొట్టించింది. భారత్‌ తరఫున గుర్జీత్‌ కౌర్‌ (7వ, 9వ నిమిషాల్లో) రెండు గోల్స్‌ చేయగా... నవ్‌జ్యోత్‌ కౌర్‌ (9వ నిమిషంలో), లాల్‌రెమ్‌సియామి (38వ నిమిషంలో) ఒక్కో గోల్‌ సాధించారు.

జపాన్‌ జట్టుకు సుజీ (17వ నిమిషంలో), ఇషిబాషి (28వ నిమిషంలో) చెరో గోల్‌ అందించారు. మరో సెమీఫైనల్లో చైనా 3–2తో కొరియాను ఓడించింది. ఆదివారం జరిగే ఫైనల్లో చైనాతో భారత్‌ తలపడుతుంది. ఓవరాల్‌గా ఈ టోర్నమెంట్‌లో భారత్‌ ఫైనల్‌కు చేరుకోవడం ఇది నాలుగోసారి. గతంలో 1999, 2004, 2009లలో ఫైనల్‌కు చేరిన టీమిండియా 2004లో టైటిల్‌ నెగ్గి, మిగతా రెండుసార్లు రన్నరప్‌గా నిలిచింది.

>
మరిన్ని వార్తలు