ఆ జట్టు జెర్సీలకు భారీ డిమాండ్‌

15 Jul, 2018 13:34 IST|Sakshi

పారిస్‌: రష్యాలో జరుగుతోన్న ఫిఫా ప్రపంచకప్‌ ఫైనల్‌కు దూసుకెళ్లిన మొదటి జట్టు ఫ్రాన్స్‌. ఈరోజు(ఆదివారం) ఫ్రాన్స్‌-క్రొయేషియా మధ్య మెగా ఫైనల్‌ జరగనుంది. తమ దేశ జట్టుకు మద్దతిచ్చేందుకు పెద్ద సంఖ్యలో ఫ్రాన్స్‌ అభిమానులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఆ జట్టు ఆటగాళ్లు ధరించే ముదురు నీలం రంగు జెర్సీలకు పారిస్‌లో భారీగా డిమాండ్‌ పెరిగింది. ఆటగాళ్ల జెర్సీలు హాట్‌ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.

దీనిలో భాగంగా తమ అభిమాన ఆటగాళ్ల జెర్సీలను సొంతం చేసుకునే పనిలో పడిపోయారు. ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లోని వస్త్ర దుకాణాల్లో ఆ దేశ ఆటగాళ్ల జెర్సీలను కొనేందుకు అభిమానులు స్టోర్ల వద్ద క్యూ కడుతున్నారు. ‘ఫ్రాన్స్‌ ఫుట్‌బాల్‌ ఆటగాళ్ల జెర్సీలు కావాలంటూ పెద్ద సంఖ్యలో ఆర్డర్లు వస్తున్నాయి. ముఖ్యంగా యువ ఆటగాళ్ల పేర్లతో కూడిన జెర్సీలు కావాలని అభిమానులు అడుగుతున్నారు. ఇప్పటికే చాలా షర్టులు విక్రయించాం. ఇంకా చాలా ఆర్డర్లు‌ ఇచ్చాం.’ అని స్టోర్ల యజమానులు తెలిపారు. అలాగే స్థానిక రెస్టారెంట్లు, బార్లు కూడా నీలం రంగు విద్యుద్దీపాల వెలుగులతో ధగధగలాడుతున్నాయి. విద్యద్దీపాలంకరణ వెలుగుల్లో పారిస్‌ నగరం మరింత ఆకర్షణీయంగా మారింది.

క్రొయేషియాతో జరిగే ఫైనల్లో ఫ్రాన్స్‌ తలపడనుంది. ఈ ప్రపంచకప్‌లో క్రొయేషియా సంచలనాలకు మారుపేరుగా నిలిచింది. మరి ఫైనల్లో గెలిచి ఏ జట్టు ట్రోఫీని కైవసం చేసుకుంటుందో చూడాలి.

మరిన్ని వార్తలు