ఫ్యూచర్‌ కిడ్స్‌ డబుల్‌ ధమాకా

9 Jul, 2019 13:50 IST|Sakshi

బాలబాలికల విభాగాల్లో టైటిల్స్‌ సొంతం

సాక్షి, హైదరాబాద్‌: జీఎం సంపత్‌ కుమార్‌ స్మారక ఇంటర్‌ స్కూల్‌ బాస్కెట్‌బాల్‌ టోర్నమెంట్‌లో ఫ్యూచర్‌ కిడ్స్‌ స్కూల్‌ జట్టు డబుల్‌ ధమాకా మోగించింది. బాలబాలికల విభాగాల్లో టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. సికింద్రాబాద్‌ వైఎంసీఏలో ముగిసిన ఈ టోర్నమెంట్‌లో బాలుర ఫైనల్లో ఫ్యూచర్‌ కిడ్స్‌ జట్టు 69–66తో చిరెక్‌ పబ్లిక్‌ స్కూల్‌పై విజయం సాధించింది. ఫ్యూచర్‌ కిడ్స్‌ తరఫున అఖిల్‌ (15 పాయింట్లు), సుభాష్‌ (14 పాయింట్లు), అద్యన్‌ (14 పాయింట్లు) రాణించారు. చిరెక్‌ జట్టు తరఫున కొఠారి (24 పాయింట్లు), ధ్రువ్‌ (12 పాయింట్లు) ఆకట్టుకున్నారు. బాలికల విభాగం ఫైనల్లో ఫ్యూచర్స్‌ కిడ్స్‌ జట్టు 54–51తో శ్రీనిధి స్కూల్‌ జట్టును ఓడించింది.

ప్యూచర్‌ కిడ్స్‌ తరపున శ్రేయ (18 పాయింట్లు), అదితి (20 పాయింట్లు), బృంద (8 పాయింట్లు) మెరిపించారు. శ్రీనిధి జట్టు తరఫున మేఘన (16 పాయింట్లు), సి. మేఘన (12 పాయింట్లు) ఆకట్టుకున్నారు. అంతకుముందు జరిగిన బాలుర సెమీఫైనల్స్‌లో ఫ్యూచర్‌ కిడ్స్‌ 78–56తో సెయింట్‌ జోసెఫ్‌ స్కూల్‌పై, చిరెక్‌ స్కూల్‌ 78–69తో లిటిల్‌ ఫ్లవర్‌ (ఉప్పల్‌) జట్టుపై గెలిచాయి. బాలికల సెమీఫైనల్స్‌లో ప్యూచర్‌ కిడ్స్‌ 42–28తో రెక్వాల్‌ఫోర్డ్‌ స్కూల్‌పై, శ్రీనిధి 38–34తో ఫ్యూచర్‌ కిడ్స్‌ ‘బి’ జట్టుపై విజయం సాధించాయి. విజేత జట్లకు జాతీయ మాజీ బాస్కెట్‌బాల్‌ ప్లేయర్‌ రామచంద్ర ట్రోఫీలను అందజేశారు.   

మరిన్ని వార్తలు