సింధుకు స్వర్ణం

25 Jan, 2014 00:11 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: నేషనల్ స్కూల్ గేమ్స్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ బాలికలు సత్తా చాటారు. అండర్-17, అండర్-19 విభాగాల్లో పోటీ పడిన ఏపీ అమ్మాయిలు ఒక స్వర్ణం, నాలుగు రజతాలు నెగ్గారు. అసోంలోని గువహటిలో గురువారం ఈ పోటీలు ముగిశాయి. అండర్-17 విభాగంలో రాష్ట్రానికి చెందిన జి. సింధు స్వర్ణం గెలుచుకుంది. 58 కేజీల కేటగిరీలో పోటీ పడిన సింధు మొత్తం 131 కిలోల (స్నాచ్ 56 కేజీలు, క్లీన్ అండ్ జర్క్ 75 కేజీలు) బరువు ఎత్తింది.
 
 అండర్-17 విభాగంలోనే ఏపీకి మరో మూడు రజతాలు లభించాయి. 44 కేజీల కేటగిరీలో టి. ప్రియదర్శిని (మొత్తం 110 కేజీలు-స్నాచ్ 46, క్లీన్ అండ్ జర్క్ 64 ), 63 కేజీల కేటగిరీలో జి. లలిత (మొత్తం 127 కేజీలు - స్నాచ్ 55, క్లీన్ అండ్ జర్క్ 72), 69 కేజీల కేటగిరీలో డి. సీతామహాలక్ష్మి (126 కేజీలు - స్నాచ్ 58, క్లీన్ అండ్ జర్క్ 68) రజతాలు గెలుచుకున్నారు. అండర్-19 విభాగంలో ఎం. ఊహాసాయికి రజత పతకం లభించింది. 75 కేజీల కేటగిరీలో పోటీ పడిన ఊహ మొత్తం 142 కిలోల (స్నాచ్ 60 కేజీలు, క్లీన్ అండ్ జర్క్ 82 కేజీలు) బరువు ఎత్తి రెండో స్థానంలో నిలిచింది.

మరిన్ని వార్తలు