గంభీర్, ధావన్‌ సూపర్‌ షో

13 Feb, 2017 00:36 IST|Sakshi
గంభీర్, ధావన్‌ సూపర్‌ షో

ముంబై: సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టి20 జాతీయ ఇంటర్‌ జోనల్‌ టోర్నమెంట్‌లో గౌతమ్‌ గంభీర్‌ (51 బంతుల్లో 81; 12 ఫోర్లు), శిఖర్‌ ధావన్‌ (38 బంతుల్లో 50; 6 ఫోర్లు, 1 సిక్స్‌) చెలరేగారు. ఇద్దరు అర్ధసెంచరీలు సాధించడంతో నార్త్‌జోన్‌ 8 వికెట్ల తేడాతో సౌత్‌జోన్‌పై జయభేరి మోగించింది. టాస్‌ నెగ్గిన నార్త్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్‌ చేపట్టిన సౌత్‌జోన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఆంధ్ర ఆటగాడు రికీ భుయ్‌ (37 బంతుల్లో 50; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించగా, హైదరాబాద్‌ ఆటగాడు తన్మయ్‌ అగర్వాల్‌ 25 పరుగులు చేశాడు. నార్త్‌ బౌలర్లలో  నెహ్రా, మయాంక్‌ చెరో 2 వికెట్లు తీయగా, హర్భజన్‌ సింగ్‌ కు ఒక వికెట్‌ దక్కింది. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన నార్త్‌జోన్‌ 18.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసి గెలిచింది.

సెంట్రల్‌ జోన్‌ గెలుపు: మరో మ్యాచ్‌లో సెంట్రల్‌ జోన్‌ 6 వికెట్ల తేడాతో వెస్ట్‌జోన్‌పై గెలిచింది. వెస్ట్‌జోన్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. దీపక్‌ హుడా (26 బంతుల్లో 49; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) చుక్కలు చూపించగా. ఆదిత్య తారే (33 బంతుల్లో 40; 5 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. తర్వాత సెంట్రల్‌ జోన్‌ 18.2 ఓవర్లలో 165 పరుగులు చేసి గెలిచింది. హర్‌ప్రీత్‌ సింగ్‌ (42 బంతుల్లో 62; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ శతకం సాధించాడు.

మరిన్ని వార్తలు