ధోని గురించి ఏమీ మాట్లాడలేదు: కోహ్లి

22 Oct, 2019 13:07 IST|Sakshi
కోహ్లి-గంగూలీ(ఫైల్‌ఫొటో)

రాంచీ:  టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని గురించి తనకు మరింత స్పష్టత రావాల్సి ఉందంటూ కొత్తగా బీసీసీఐ అధ్యక్ష పదవి చేపట్టబోతున్న సౌరవ్‌ గంగూలీ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.  అయితే దీనిపై టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లితో ఏమైనా మాట్లాడి ఉండి వచ్చనే వార్తలు వినిపించాయి. దీనిపై దక్షిణాఫ్రికాతో మూడో టెస్టులో గెలిచిన తర్వాత కోహ్లి మాట్లాడుతూ.. ‘ ధోని క్రికెట్‌ భవిష్యత్తు గురించి గంగూలీ ఇప్పటివరకూ నాతో ఏమీ మాట్లాడలేదు. బీసీసీఐ కొత్త అధ్యక్షుడు గంగూలీకి అభినందనలు తెలియజేస్తున్నా.

గంగూలీ బీసీసీఐ ప్రెసిడెంట్‌గా రావడం గొప్పగా ఉంది. గంగూలీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత నాతో టచ్‌లో ఉంటాడు. నేను ముందుగానే గంగూలీని కలుస్తా. కాకపోతే ఇప్పటివరకూ ధోని గురించి కానీ జట్టు గురించి కానీ గంగూలీ నాతో ఏమీ మాట్లాడలేదు’ అని కోహ్లి తెలిపాడు.అక్టోబర్‌ 24వ తేదీన బీసీసీఐ అధ్యక్షుడి హోదాలో ఉండబోతున్న గంగూలీని కలుస్తానని కోహ్లి పేర్కొన్నాడు. ఒక బీసీసీఐ ప్రెసిడెంట్‌తో ఒక కెప్టెన్‌గా ఏమి మాట్లాడాలో అప్పుడే మాట్లాడతానని అన్నాడు.  రాంచీలో మ్యాచ్‌ ముగిసింది కదా.. మీరు ధోని ఇంటికి వెళతారా అని ప్రశ్నించగా కోహ్లి తనదైన శైలిలో జవాబిచ్చాడు. ఈ రోజు ఆటలో ధోనినే ఇక్కడకు వచ్చి ఆటగాళ్లను కలిసాడు కదా అని కోహ్లి బదులిచ్చాడు.

మరిన్ని వార్తలు