ప్రపంచకప్‌లో పాక్‌కు కలిసొచ్చే అంశం అదే

15 May, 2019 10:33 IST|Sakshi

ఇంగ్లండ్‌, ఆసీస్‌లు సెమీస్‌ వరకే

టీమిండియాకు పాక్‌ పోటీ ఇచ్చే అవకాశం

కోహ్లి కెప్టెన్సీపై అనుమానం వద్దు: గంగూలీ

కోల్‌కతా: ఇంగ్లండ్‌ వేదికగా జరగనున్న ప్రపంచకప్‌-2019ను పాకిస్తాన్‌ హాట్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోందని  టీమిండియా మాజీ సారథి సౌరవ్‌ గంగూలీ పేర్నొన్నాడు. పాక్‌కు ఇంగ్లీష్‌ గడ్డపై ఘనమైన రికార్డు ఉందన్నాడు. ఇంగ్లండ్‌లోనే పాక్‌ రెండు ఐసీసీ(చాంపియన్స్‌ ట్రోఫీ, వరల్ట్‌ టీ20) కప్‌లను సాధించిందని గుర్తు చేశాడు. ప్రస్తుత సీజన్‌లోనూ ఇంగ్లీష్‌ పిచ్‌లపై ఆ జట్టు అదరగొడుతోందని తెలిపాడు. అసాధ్యమనుకున్న ఛేదనలో దగ్గర వరకు వచ్చి ఆగింది. పాక్ బౌలింగ్ లైనప్‌తో ప్రత్యర్థులకు కష్టాలు తప్పకపోవచ్చుఅని గంగూలీ చెప్పుకొచ్చాడు. ఇక ఆతిథ్య ఇంగ్లండ్‌, డిపెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా జట్లు సెమీఫైనల్‌ వరకే పరిమితమవుతాయని జోస్యం చెప్పాడు. దీంతో టీమిండియాకు పోటీగా పాక్‌ నిలిచే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. 

కోహ్లి కెప్టెన్సీపై అనుమానం వద్దు
విశ్వసమరంలో భారత్, పాకిస్థాన్ పోరుపై దాదా స్పందిస్తూ.. తాను రికార్డులను నమ్మనని, మ్యాచ్ రోజు ఎవరు మంచి ప్రదర్శన చేస్తే.. విజయం వారినే వరిస్తుందన్నాడు. ప్రపంచకప్‌లో టీమిండియాకు బ్యాటింగ్‌ ప్రధాన బలం కానుందన్నాడు. టాపార్డర్‌లో కోహ్లి, ధావన్‌, రోహిత్‌లలో ఏ ఒక్కరు నిలుచున్నా ప్రత్యర్థిజట్టుకు చుక్కులేనని అన్నాడు. నాలుగో ప్రపంచకప్‌ ఆడుతున్న ధోని అనుభవం టీమిండియాకు ఉపయోగపడుతుందున్నాడు. ఐపీఎల్‌లో బెంగళూరు కెప్టెన్‌గా విరాట్ వైఫల్యం వన్డే వరల్డ్‌కప్ సారథ్యంపై ఎలాంటి ప్రభావం చూపదని టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. భారత్ తరఫున వన్డేల్లో కోహ్లీకి మెరుగైన రికార్డు ఉందని దాదా గుర్తుచేశాడు. విజయవంతమైన కెప్టెన్లు మహేంద్రసింగ్ ధోనీ, రోహిత్ శర్మ జట్టులో ఉండటం కోహ్లీకి కలిసొచ్చే అంశమని పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు