ఆ 40 నిమిషాల భేటీ.. నా హృదయాన్ని తాకింది!

26 Dec, 2019 14:24 IST|Sakshi

కరాచీ: భారత క్రికెట్‌ జట్టుకు తన దూకుడైన ఆటతో విదేశీ గడ్డపై ఎలా విజయాలు సాధించాలో నేర్పిన మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా కూడా సక్సెస్‌ అవుతాడని పాకిస్తాన్‌ దిగ్గజ స్పిన్నర్‌ సక్లయిన్‌ ముస్తాక్‌ అభిప్రాయపడ్డాడు ఈ మేరకు తనకు గతంలో గంగూలీతో జరిగిన ఓ భేటీని ముస్తాక్‌ గుర్తు చేసుకున్నాడు. తాను కష్ట కాలంలో ఉన్నప్పుడు ఆప్యాయంగా గంగూలీ పలకరించిన తీరు తన హృదయాన్ని తాకిందని ముస్తాక్‌ పేర్కొన్నాడు.  కేవలం గంగూలీ తనతో 48 నిమిషాల పాటు మంచి-చెడు మాట్లాడిన తీరు ఇప్పటికీ తన మదిలో ఉండిపోయిందన్నాడు. రెండు మోకాళ్లకు ఆపరేషన్‌ అయి కోలుకుంటున్న తన వద్దకు సౌరవ్‌ గంగూలీ వచ్చి పరామర్శించడం అతడి గొప్ప హృదయానికి నిదర్శనమన్నాడు.

‘2005-06లో ఇది జరిగింది. ఇంగ్లండ్‌ టూర్‌లో భాగంగా భారత జట్టు ససెక్స్‌తో మూడు రోజుల మ్యాచ్‌ ఆడుతోంది. ఆ మ్యాచ్‌కు గంగూలీ దూరంగా ఉన్నాడు. అప్పట్లో రెండు మోకాళ్లకు ఆపరేషన్‌ అయి నేను డిప్రెషన్‌లో ఉన్నా. క్రికెట్‌లో పునరాగమనం కోసం వేచి చూస్తుండగా..  బాల్కనీలో ఉన్న గంగూలీ ససెక్స్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌కు వచ్చాడు. ఆ తర్వాత ఇద్దరం కలిసి చాయ్‌ తాగాం. ఎలా ఉన్నావు.. గాయం మానిందా.. కుటుంబం ఎలా ఉందని అడిగాడు. ఆ మాటలు నా హృదయాన్ని తాకాయి. ఆ 40 నిమిషాల భేటీలో గంగూలీ అప్యాయంగా పలకరించాడు. ఇది ఎప్పటికీ నా మనసులో ఉండిపోతుంది. ఇక బీసీసీఐ అధ్యక్షుడిగా కూడా గంగూలీ సక్సెస్‌ అవుతాడు’ అని ముస్తాక్‌ ఒక యూట్యూబ్‌ వీడియోలో తెలిపాడు.

మరిన్ని వార్తలు