కౌంటీలకు వెళ్లిన గంభీర్..

16 Aug, 2013 16:41 IST|Sakshi

టీమిండియాకు ఇటీవల దూరమైన క్రికెటర్లకు శాశ్వతంగా జట్టులో స్థానం కోల్పోతామనే భయం పట్టుకుంది. అందుకే ఫిట్‌నెస్‌, ఫామ్‌ పుంజుకుని మళ్లీ జట్టులో చేరే ప్రయత్నాల్లో యువరాజ్‌సింగ్‌, జహీర్‌ఖాన్‌ బాగా బిజీ బిజీ అయ్యారు. వీరి బాటలోనే తాజాగా గౌతం గంభీర్‌ కూడా చేరాడు.

ఇంగ్లీష్‌ కౌంటీ ఎసెక్స్‌ తరపున ఫస్ట్‌ డివిజన్‌లో ఆడేందుకు గంభీర్‌ లండన్‌ బయల్దేరాడు. ఐపీఎల్‌ టీమ్స్‌ ఐర్లాండ్‌, స్కాట్లాండ్‌ల్లో ఆడేందుకు ఇంగ్లీష్‌ క్రికెట్‌ బోర్డు నిరాకరించడంతో గతంలో బీసీసీఐతో విభేదాలు రచ్ఛకెక్కాయి. అయితే గంభీర్‌కు బీసీసీఐ నిరభ్యంతర సర్టిఫికెట్ (ఎన్‌ఓసీ) ఇవ్వడం, ఇంగ్లండ్‌ బోర్డు కూడా అంగీకరించడం లాంటివి చూస్తే పరిస్థితి మారిందన్న విషయం స్పష్టమవుతోంది.

ఇటీవలి కాలంలో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని కుర్రాళ్లు కుమ్మేస్తున్న విషయం తెలిసిందే. జింబాబ్వే వెళ్లి, ఆ దేశంతో జరిగిన సిరీస్ మొత్తాన్ని 5-0తో క్లీన్ స్వీప్ చేయడంతో వాళ్లమీద బీసీసీఐతో పాటు అందరికీ అంచనాలు పెరిగాయి. దాంతో ఉన్న స్థానాన్ని పదిలంగా కాపాడుకునే ప్రయత్నాల్లో టీమిండియా కుర్రాళ్లు నిమగ్నమయ్యారు. వాళ్లను చూసి, వాళ్ల పట్టుదల చూసి.. ఇక ఇలాగే అయితే ఇప్పటికే చేజారిన తమ స్థానం మళ్లీ ఎప్పటికీ చేతికి అందదేమోనన్న భయం సీనియర్లకు పట్టుకుంది. ఎలాగోలా తమ ఫామ్ నిరూపించుకుని, మళ్లీ టీమిండియాలో సభ్యుడిగా స్థానం పొందాలన్న తపనతో తెగ కృషి చేస్తున్నారు.

మరిన్ని వార్తలు