అందులో నిజం లేదు: గేల్‌

15 Aug, 2019 12:10 IST|Sakshi

ట్రినిడాడ్‌: టీమిండియాతో జరిగిన మూడో వన్డేనే తనకు చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ అంటూ వార్తలు రావడంపై వెస్టిండీస్‌ స్టార్‌ క్రికెటర్‌ క్రిస్‌ గేల్‌ స్పందించాడు. తాను ఇంకా రిటైర్మెంట్‌ ప్రకటించలేదంటూ స్పష్టం చేశాడు. తన రిటైర్మెంట్‌కు సంబంధించి ఎటువంటి ప్రకటన చేయలేదని, అవన్నీ రూమర్లేనని వివరణ ఇచ్చాడు. భారత్‌తో టెస్టు సిరీస్‌ తర్వాత రిటైర్మెంట్‌ ప్రకటిస్తానంటూ వరల్డ్‌కప్‌ తర్వాత గేల్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే భారత్‌తో జరగబోయే రెండు టెస్టుల సిరీస్‌కు గేల్‌ను ఎంపిక చేయలేదు.

దాంతో టీమిండియాతో జరిగిన మూడో వన్డేనే గేల్‌ ఆఖరిదంటూ అభిమానులు సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. దీనిపై వివరణ ఇచ్చిన గేల్‌.. తన రిటైర్మెంట్‌పై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నాడు. భారత్‌తో జరిగిన చివరి వన్దే గేల్‌ మెరుపులు మెరిపించాడు. 41 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 72 పరుగులు సాధించాడు. ఫలితంగా విండీస్‌ 35 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. అయితే ఆపై వర్షం కారణంగా డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం భారత లక్ష్యాన్ని 35 ఓవర్లలో 255 పరుగులుగా నిర్ణయించారు. ఈ లక్ష్యాన్ని భారత్‌ 32.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

>
మరిన్ని వార్తలు