గౌరవం ఇవ్వడం లేదు.. భారం అనుకున్నారు: గేల్‌

26 Nov, 2019 15:59 IST|Sakshi

జమైకా:  దక్షిణాఫ్రికాలో జరుగుతున్న మాన్షి సూపర్ లీగ్‌కి వెస్టిండీస్ విధ్వంసకర ఓపెనర్ క్రిస్ గేల్ గుడ్ బై చెప్పాడు.  తనకు జట్టులో కనీస గౌరవం, మర్యాద దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేసాడు. తాను భారంగా మారిపోయానని జట్టు యాజమాన్యం భావించిన విషయాన్ని అర్థం చేసుకునే దాన్ని నుంచి తప్పుకున్నానన్నాడు. ఈ లీగ్‌లో జోజీ స్టార్స్ ఫ్రాంఛైజీ తరపున క్రిస్ గేల్ ఆడుతున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు జోజీ స్టార్స్ ఆరు మ్యాచ్‌లు ఆడగా.. ఒక్కటి కూడా విజయం సాధించలేదు. యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో 101 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ మొత్తం టోర్నమెంట్‌లో గేల్‌కు 50కి పైగా పరుగులు ఒకసారి మాత్రమే చేశాడు.ఇదే సమయంలో క్రిస్ గేల్ మీడియాతో మాట్లాడుతూ తన ఆవేదనను అభిమానులతో పంచుకున్నాడు.

'నేను వరసగా రెండు, మూడు మ్యాచులు సరిగా ఆడకపోతే చాలు.. జట్టుకి భారంగా కనిపిస్తాను. జట్టులోని సభ్యులు నన్ను భారంగా భావిస్తున్నారని నేను ఈ నిర్ణయం తీసుకోలేదు. ఎన్నో సంవత్సరాలుగా ఈ ఫ్రాంఛైజీ తరపున క్రికెట్ ఆడుతున్నా. అప్పటి నుంచి పరిశీలించిన తర్వాతే నాకు ఈ విషయం అర్ధం అయింది. జట్టులో కనీసం మర్యాద కూడా దక్కడం లేదు. నేను గతంలో ఏమి చేశానో వాళ్లకు గుర్తుంచుకోవడం లేదు. అయితే నేను ఫ్రాంఛైజీ గురించి మాట్లాడటం లేదు, జనాలు ఏమనుకుంటున్నారో మాత్రమే చెబుతున్నా. ఒక్కసారి గేల్ విఫలం అయితే.. ఇక అతని కెరిర్ ముగిసిపోయినట్లే, అతను మంచి ప్లేయర్ కాదు లాంటి లాంటి కామెంట్స్ నాపై వస్తున్నాయి' అని గేల్ పేర్కొన్నాడు.ఇంగ్లండ్‌లో జరిగిన వన్డే వరల్డ్‌కప్‌ తర్వాత గేల్ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అందరూ అనుకున్నారు. కానీ.. అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ ఇప్పటివరకు కూడా రిటైర్మెంట్ ఇవ్వలేదు. ప్రపంచకప్‌లో పరుగులు చేయలేక తీవ్రంగా నిరాశపరిచాడు. అనంతరం ఆడిన సిరీస్‌ల్లో కూడా తన మార్క్ చూపించలేదు. దీంతో అతడు విండీస్ జట్టులో చోటు కోల్పోయాడు.

మరిన్ని వార్తలు