క్రిస్‌ గేల్‌ ఆల్‌టైమ్‌ రికార్డు!

12 Aug, 2019 11:07 IST|Sakshi

ట్రినిడాడ్‌: వెస్టిండీస్‌ విధ్వంసకర ఆటగాడు క్రిస్‌ గేల్‌ మరో రికార్డును సాధించాడు. వెస్టిండీస్‌ తరఫున అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలోనే ఇప్పటివరకూ బ్రియాన్‌ లారా పేరిట ఉన్న రికార్డును గేల్‌ బ్రేక్‌ చేశాడు. ఆల్‌టైమ్‌ మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా టీమిండియాతో జరిగిన రెండో వన్డేలో గేల్‌ ఈ మార్కును చేరాడు. భారత్‌పై గేల్‌ 11 పరుగులకే పెవిలియన్‌ చేరినప్పటికీ లారా రికార్డును సవరించాడు. విండీస్‌ తరఫున లారా 10, 405 వన్డే పరుగులు సాధించగా, గేల్‌ 10, 408 పరుగులతో టాప్‌కు చేరుకుని ఆల్‌టైమ్‌ రికార్డును నమోదు చేశాడు.

ఇది గేల్‌కు 300వ వన్డే కావడం మరో విశేషం. ఈ మ్యాచ్‌కు ముందు లారా రికార్డుకు 9 పరుగుల దూరంలో నిలిచిన గేల్‌.. . భారత లెఫ్టార్మ్‌ పేసర్‌ ఖలీల్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో ఫోర్‌ కొట్టడం ద్వారా విండీస్‌ తరఫున వన్డేల్లో అత్యధక పరుగుల ఫీట్‌ను చేరుకున్నాడు. కాగా, లారా రికార్డును బ్రేక్‌ చేసిన కాసేపటికే గేల్‌ పెవిలియన్‌ చేరాడు. భువనేశ్వర్‌ కుమార్‌ బౌలింగ్‌లో వికెట్లు ముందు దొరికిపోయాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 279 పరుగులు చేసింది.

కాగా, మ్యాచ్‌కు వర్షం అంతరాయం కల్గించడంతో టార్గెట్‌ను 46 ఓవర్లలో 270 పరుగులకు కుదించారు. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విండీస్‌ 42 ఓవర్లలో 210 పరుగులకే ఆలౌటైంది. విండీస్‌ ఆటగాళ్లలో ఎవిన్‌ లూయిస్‌(65), పూరన్‌(42) మినహా ఎవరూ రాణించకపోవడం ఓటమి తప్పలేదు.  దాంతో భారత్‌ 59 పరుగుల తేడాతో(డక్‌వర్త్‌లూయిస్‌ ప్రకారం) విజయం సాధించింది. భారత బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌ నాలుగు వికెట్లు సాధించగా, షమీ, కుల్దీప్‌ యాదవ్‌లు తలో రెండు వికెట్లు తీశారు. ఖలీల్‌ అహ్మద్‌, రవీంద్ర జడేజాలకు చెరో వికెట్‌ దక్కింది. (ఇక్కడ చదవండి: విండీస్‌పై భారత్‌ విజయం)

మరిన్ని వార్తలు