గుజరాత్ టీమ్ కు భారీ నజరానా!

15 Jan, 2017 19:25 IST|Sakshi
గుజరాత్ టీమ్ కు భారీ నజరానా!

వడోదర: తొలిసారిగా రంజీ ట్రోఫీ సాధించిన తమ రాష్ట్ర క్రికెట్ జట్టుకు గుజరాత్ క్రికెట్ సంఘం(జీసీఏ) భారీ నజరానా ప్రకటించింది. పార్థివ్ పటేల్‌ నాయకత్వంలోని రంజీ జట్టుకు రూ. 3 కోట్ల నగదు ప్రోత్సాహ బహుమతి ఇవ్వనున్నట్టు తెలిపింది. బీసీసీఐ రూ. 2 కోట్లకు ఇది అదనమని జీసీఏ ఉపాధ్యక్షుడు పరిమళ్ నాథ్వానీ తెలిపారు. ‘పార్థివ్ పటేల్‌ నేతృత్వంలోని గుజరాత్ జట్టు చారిత్రక విజయం సాధించి 66 ఏళ్ల తొలిసారిగా రంజీ ట్రోఫీని దక్కించుకుంద’ని ఆయన వ్యాఖ్యానించారు.

ఇండోర్‌ జరిగిన ఫైనల్‌ మ్యాచ్ లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై జట్టును 5 వికెట్ల తేడాతో మట్టికరిపించి గుజరాత్‌ రంజీ ట్రోఫీని తొలిసారిగా దక్కించుకుంది. పార్థివ్ పటేల్‌ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి 143 పరుగులు చేసి ఒంటిచేత్తో జట్టుకు విజయాన్ని అందించాడు. 42వ సారి ఈ ట్రోఫీని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించాలనుకున్న ముంబై ఆశల మీద నీళ్లు చల్లాడు. జీసీఏ అధ్యక్షుడిగా ఉన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. గుజరాత్ క్రికెట్ టీమ్ కు అభినందనలు తెలిపారు.

మరిన్ని వార్తలు