గోల్‌కీపర్‌ ఆకాశ్‌ చిక్టేపై రెండేళ్ల నిషేధం

20 Oct, 2018 01:52 IST|Sakshi

మిగతా ఆరుగురికి నాలుగేళ్లు  

న్యూఢిల్లీ: నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్న భారత క్రీడాకారులపై జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా) సస్పెన్షన్‌ వేటు వేసింది. భారత హాకీ గోల్‌ కీపర్‌ ఆకాశ్‌ చిక్టేపై రెండేళ్లు, రెజ్లర్‌ అమిత్, కబడ్డీ ప్లేయర్‌ ప్రదీప్‌ కుమార్, వెయిట్‌లిఫ్టర్‌ నారాయణ్‌ సింగ్, అథ్లెట్స్‌ సౌరభ్‌ సింగ్, బల్జీత్‌ కౌర్, సిమర్జిత్‌ కౌర్‌లపై నాలుగేళ్ల నిషేధం విధించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో బెంగళూరులో నిర్వహించిన శిక్షణ శిబిరం సందర్భంగా చిక్టే రక్త,మూత్ర నమూనాల్ని పరీక్షించారు.

ఇందులో నిషిద్ధ ఉత్ప్రేరకాలైన అనబాలిక్‌ స్టెరాయిడ్‌ తీసుకున్నట్లు తేలింది. అయితే అతను కావాలని దీన్ని తీసుకోలేదని కాలికి దెబ్బతగలడంతో డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌తో మెడిసిన్‌ ద్వారా తీసుకున్నట్లు చెప్పారు. దీంతో అతనికి కేవలం రెండేళ్ల నిషేధంతోనే సరిపెట్టగా... మిగతా ఆరుగురు మాత్రం ఎప్పుడు, ఎందుకు తీసుకున్నారో వెల్లడించకపోవడంతో నాలుగేళ్లు నిషేధించారు. అయితే దీనిపై అప్పీలు చేసుకునేందుకు ఆటగాళ్లకు అవకాశముంది. 2016 ఆసియా హాకీ చాంపియన్స్‌ ట్రోఫీలో విజేతగా నిలిచిన భారత పురుషుల జట్టుకు ఆకాశ్‌ గోల్‌కీపర్‌గా వ్యవహరించాడు.  

 

మరిన్ని వార్తలు