ఆ ట్యాగ్‌తో అలసిపోయా: ఇషాంత్‌

4 Aug, 2018 14:29 IST|Sakshi

బర్మింగ్‌హామ్‌: ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో భాగంగా రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో సత్తాచాటిన టీమిండియా పేసర్‌ ఇషాంత్‌ శర్మ తన ప్రదర్శనపై అమితమైన ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. తన శ్రమకు తగిన ఫలితం దక్కిందన్న ఇషాంత్‌.. దేశానికి ఆడటాన్ని ఎప్పుడూ గర్వంగా భావిస్తానన్నాడు.

‘ నాకు ఢిపెన్సివ్‌ బౌలర్‌ అనే ట్యాగ్‌ ఉంది. ఇప్పటికే ఆ ట్యాగ్‌తో అలసిపోయా. తాజా ప్రదర్శనతో దానికి ముగింపు పడుతుందనే అనుకుంటున్నా. నాకు బౌలర్‌గా మంచి చరిత్ర లేకపోయినా, నేను బౌలింగ్‌ బాగానే వేస్తాననే విషయం నాకు తెలుసు’ అని ఇషాంత్‌ తెలిపాడు. ఇక తొలి టెస్టులో విజయం సాధిస్తామనే ధీమా వ్యక్తం చేశాడు ఇషాంత్‌. వెంటవెంటనే ఐదు వికెట్లు కోల్పోయినప్పటికీ, ఒక చక్కటి భాగస్వామ్యంతో చిన్నపాటి లక్ష్యాన్ని ఛేదిస్తామన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో వికెట్‌ సాధించిన ఇషాంత్‌.. రెండో ఇన్నింగ్స్‌లో చెలరేగి బౌలింగ్‌ వేశాడు. ఐదు వికెట్లు సాధించి ఇంగ్లండ్‌ పతనాన్ని శాసించాడు. దాంతో ఇంగ్లండ్‌ తన రెండో ఇన్నింగ్స్‌లో 180 పరుగులకే ఆలౌటై, 194 పరుగుల లక్ష్యాన్ని భారత్‌కు నిర్దేశించింది.

>
మరిన్ని వార్తలు