పురుషుల వన్డేకు మహిళా మ్యాచ్‌ రిఫరీ

6 Dec, 2019 00:53 IST|Sakshi

ఆంధ్ర మాజీ క్రికెటర్‌ జీఎస్‌ లక్ష్మి కొత్త చరిత్ర

దుబాయ్‌: ఈ ఏడాది మే నెలలో అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) మ్యాచ్‌ రిఫరీల ప్యానల్‌లో చోటు దక్కించుకున్న తొలి మహిళగా చరిత్ర సృష్టించిన భారత మాజీ క్రికెటర్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గండికోట సర్వ (జీఎస్‌) లక్ష్మి ఖాతాలో మరో ఘనత చేరనుంది. అంతర్జాతీయ పురుషుల వన్డే మ్యాచ్‌కు రిఫరీగా పనిచేయనున్న మొట్టమొదటి మహిళా మ్యాచ్‌ రిఫరీగా ఆమె రికార్డు నెలకొల్పనున్నారు. ఐసీసీ పురుషుల క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ లీగ్‌–2 టోర్నీలో భాగంగా యూఏఈ వేదికగా ఆదివారం యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ), యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా (యూఎస్‌ఏ) జట్ల మధ్య జరిగే మ్యాచ్‌కు లక్ష్మి మ్యాచ్‌ రిఫరీగా వ్యవహరించనున్నారు.

ఈ అరుదైన అవకాశం తనకు రావడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేసింది. ‘చాలా గొప్పగా అనిపిస్తుంది. గర్వంగా ఉంది. ఏదైనా మనతోనే మొదలైంది అని చెప్పుకోవడంలో ఒక ఆనందం ఉంటుంది. ఐసీసీ టోరీ్నలకు పనిచేయడం గొప్పగా ఉంటుంది’ అని 51 ఏళ్ల లక్ష్మి పేర్కొన్నారు. 2008–09 సీజన్‌లో మొదటిసారి దేశవాళీ మహిళా క్రికెట్‌ మ్యాచ్‌లకు రిఫరీగా వ్యవహరించిన ఆమె... అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటివరకు 3 మహిళల వన్డేలకు, 7 టి20 మ్యాచ్‌లకు పనిచేశారు. 20 అంతర్జాతీయ పురుషుల టి20 మ్యాచ్‌లకు కూడా ఆమె రిఫరీగా వ్యవహరించారు.   

మరిన్ని వార్తలు