ఫైనల్లో గుజరాత్‌

4 Jan, 2019 03:10 IST|Sakshi

ముంబై: ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌ ప్రొ కబడ్డీ లీగ్‌ ఆరో సీజన్‌ ఫైనల్‌కు చేరింది. గురువారం జరిగిన క్వాలిఫయర్‌–2లో గుజరాత్‌ 38–31తో యూపీ యోధాపై గెలిచి తుదిపోరుకు అర్హత సాధించింది. శనివారం జరిగే టైటిల్‌ పోరులో బెంగళూరు బుల్స్‌తో గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌ అమీతుమీ తేల్చుకోనుంది. మ్యాచ్‌ ఆరంభంలో ఇరు జట్లు హోరాహోరీగా పోరాడటంతో పలుమార్లు స్కోర్లు సమమయ్యాయి. ఒక దశలో మ్యాచ్‌పై యూపీ యోధ పైచేయి కనబర్చినా... తొలి అర్ధభాగం ముగిసే సమయానికి గుజరాత్‌ 19–14తో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాతా రెండో సగంలో మరింత దూకుడు పెంచి 29–14తో ముందంజ వేసింది. చివర్లో తేరుకున్న యూపీ వరుస పాయిట్లతో బెంబేలెత్తించినా చివరకు 7 పాయింట్ల తేడాతో పరాజయం పాలైంది. గుజరాత్‌ తరఫున సచిన్‌ 10 పాయింట్లతో మెరవగా... రోహిత్, ప్రపంజన్‌ చెరో 5 పాయింట్లు సాధించారు. యూపీ యోధా తరఫున శ్రీకాంత్‌ 7, నితేశ్‌ 6 పాయింట్లు సాధించారు.    

మరిన్ని వార్తలు