అక్షర్ పటేల్ 'ఆరే'శాడు!

26 Dec, 2015 20:26 IST|Sakshi
అక్షర్ పటేల్ 'ఆరే'శాడు!

ఆలూర్(కర్ణాటక):వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో  జరుగనున్న సిరీస్ లో టీమిండియా వన్డే జట్టులో స్థానం సంపాదించిన స్పిన్నర్ అక్షర్ పటేల్.. విజయ్ హజారే వన్డే ట్రోఫీ  సెమీ ఫైనల్లో చెలరేగిపోయాడు.  శనివారం ఇక్కడ కేఎస్సీఏ మైదానంలో తమిళనాడుతో జరిగిన రెండో సెమీ ఫైనల్లో అక్షర్ పటేల్ ఆరు వికెట్లు సాధించి గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అక్షర్ 10.0 ఓవర్లలో ఒక మేడిన్ సాయంతో 43 పరుగులిచ్చి పొదుపుగా  బౌలింగ్ చేశాడు. దీంతో గుజరాత్ 31 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్ కు చేరింది.

 

తొలుత టాస్ గెలిచిన తమిళనాడు ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 248 పరుగులు చేసింది. గుజరాత్ ఆటగాళ్లలో కెప్టెన్ పార్థీవ్ పటేల్ (0) నిరాశపరిచినా, ప్రియాంక్ పాంచల్(25) ఫర్వాలేదనిపించాడు. అనంతర చిరాగ్ గాంధీ(71), జునేజా(74)లు రాణించడంతో గుజరాత్ గౌరవప్రదమైన స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన తమిళనాడు 47.3 ఓవర్లలో 217 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. తమిళనాడు ఆటగాళ్లలో అభినవ్ ముకుంద్(104) , దినేశ్ కార్తీక్(41)లు జట్టును గెలిపించేందుకు చేసిన ప్రయత్నం వృథా ప్రయాసే అయ్యింది.

 

అంతకుముందు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో హిమాచల్ ప్రదేశ్ తో జరిగిన తొలి సెమీ ఫైనల్లో గౌతం గంభీర్ సారథ్యంలోని ఢిల్లీ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్ కు చేరింది. దీంతో  సోమవారం జరిగే ఫైనల్ పోరులో ఢిల్లీ-గుజరాత్ లు టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకోనున్నాయి.

మరిన్ని వార్తలు