గుర్‌ప్రీత్‌కు రజతం జీతూరాయ్‌కు కాంస్యం

30 Sep, 2015 00:36 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆసియా ఎయిర్ గన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ల పతకాల వేట కొనసాగుతోంది. మంగళవారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత ఈవెంట్‌లో గుర్‌ప్రీత్ సింగ్ రజతం... జీతూ రాయ్ కాంస్య పతకం గెలిచారు. ఇరాన్ షూటర్ సెఫెర్ బొరూజెని (198.7 పాయింట్లు) స్వర్ణ పతకం సాధించాడు. గుర్‌ప్రీత్ 197.6 పాయింట్లు, జీతూ రాయ్ 177.6 పాయింట్లు స్కోరు చేశారు. గుర్‌ప్రీత్ సింగ్, జీతూ రాయ్, ఓంకార్ సింగ్‌లతో కూడిన భారత బృందం టీమ్ ఈవెంట్‌లో 1734 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది.

జూనియర్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో సుమేధ్ కుమార్ స్వర్ణం, హేమేంద్ర సింగ్ రజత పతకం నెగ్గారు. యూత్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మోహిత్ గౌర్ కాంస్యం నెగ్గగా... మోహిత్ గౌర్, షైన్‌కి నాగర్, సమర్జీత్ సింగ్‌లతో కూడిన భారత జట్టుకు రజతం లభించింది.
 
 

మరిన్ని వార్తలు