న్యూఢిల్లీ: భారత మహిళా అథ్లెట్ నిర్మలా షెరాన్ డోపింగ్లో దొరికింది. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిర్వహించిన పరీక్షల్లో ఆమె నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలింది. దీంతో భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) నిర్మలపై వేటు వేసింది. జకార్తా ఆసియా క్రీడల్లో 400 మీటర్ల పరుగు పందెంలో పోటీపడిన ఆమె నాలుగో స్థానంలో నిలిచింది.
ఈ డోపింగ్ వ్యవహారంపై ఏఎఫ్ఐ చీఫ్ అదిలె సుమరివాలా స్పందించారు. ‘ఆసియా క్రీడల కోసం ఏఎఫ్ఐ ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరాలకు నిర్మలా ఎప్పుడూ హాజరు కాలేదు. ఎక్కడ ఉందో అనే వివరాలను మాకెప్పుడు చెప్పలేదు. అందుకే రిలే ఈవెంట్లలో ఆమెను ఎంపిక చేయలేదు. డోపీగా తేలడంతో నాలుగేళ్ల పాటు నిషేధం విధిస్తున్నాం’ అని సుమరివాలా అన్నారు.