పాకిస్తాన్‌ దంచికొట్టింది..

3 Jun, 2019 18:59 IST|Sakshi

నాటింగ్‌హామ్‌: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ఘోర పరాభవం ఎదుర్కొన్న పాకిస్తాన్‌ తన రెండో మ్యాచ్‌లో చెలరేగిపోయింది.  సోమవారం ట్రెంట్‌ బ్రిడ్జ్‌ వేదికగా ఆతిథ్య ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్‌ 349 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. పాక్‌ ఆటగాళ్లలో ఇమాముల్‌ హక్‌(44:58 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), ఫకార్‌ జమాన్‌(36:40 బంతుల్లో 6 ఫోర్లు), బాబర్‌ అజామ్‌(63:66 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), హఫీజ్‌ ‌(84: 62 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు), సర్పరాజ్‌ అహ్మద్‌(55: 44 బంతుల్లో 5 ఫోర్లు)లు రాణించి జట్టు భారీ స్కోరు చేయడంలో సహకరించారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌ ఆది నుంచి దూకుడుగా ఆడింది. ప్రధానంగా ఓపెనర్లు ఇమాముల్‌ హక్‌-ఫకార్‌ జమాన్‌లు అత్యంత నిలకడగా ఆడి మంచి శుభారంభాన్ని అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 82 పరుగులు జత చేసిన తర్వాత ఫకార్‌ జమాన్‌ ఔటయ్యాడు. మొయిన్‌ అలీ వేసిన 15 ఓవర్‌ తొలి బంతికి ఫకార్‌ జమాన్‌ స్టంపౌట్‌ అయ్యాడు.

అటు తర్వాత ఇమాముల్‌ హక్‌- బాబర్‌ అజామ్‌లు స్కోరు బోర్డును చక్కదిద్దారు. అయితే జట్టు స్కోరు 111 పరుగుల వద్ద ఇమాముల్‌ హక్‌ భారీ షాట్‌కు యత్నించి రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. మొయిన్‌ అలీ బౌలింగ్‌ క్రిస్‌ వోక్స్‌ అద్భుతమైన క్యాచ్‌ పట్టడంతో ఇమాముల్‌ హక్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. ఇక బాబర్‌ అజామ్‌-హఫీజ్‌లు స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. హఫీజ్‌ దూకుడుగా ఆడగా, బాబర్‌ అజామ్‌ కుదురుగా ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఈ జోడి 88 పరుగులు జత చేసిన తర్వాత అజామ్‌ మూడో వికెట్‌గా ఔటయ్యాడు. ఆ తరుణంలో హపీజ్‌తో కెప్టెన్‌ సర్పరాజ్‌ అహ్మద్‌ జత కలిశాడు. వీరు 80 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన తర్వాత హఫీజ్‌ ఔటయ్యాడు. ఇక గత మ్యాచ్‌లో విఫలమై పూర్తిగా విమర్శలు పాలైన సర్పరాజ్‌.. ఈ మ్యాచ్‌లో బాధ్యతాయుతంగా ఆడాడు. ఈ క్రమంలోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. స్కోరును పెంచే క్రమంలో సర్పరాజ్‌ ఔట్‌ కాగా, చివరి వరుస ఆటగాళ్లు సైతం బ్యాట్‌ ఝుళిపించడంతో పాకిస్తాన్‌ నిర్ణీత ఓవర్లలో  ఎనిమిది వికెట్ల నష్లానికి 348 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో మొయిన్‌ అలీ, క్రిస్‌ వోక్స్‌లు తలో మూడు వికెట్లు సాధించగా, మార్క్‌వుడ్‌ రెండు వికెట్లు తీశాడు.

మరిన్ని వార్తలు