అతనికి మళ్లీ అవకాశం ఇవ్వండి: భజ్టీ

21 Nov, 2019 12:04 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత పరిమిత ఓవర్ల క్రికెట్‌లో యజ్వేంద్ర చహల్‌, కుల్దీప్‌ యాదవ్‌లు రెగ్యులర్‌ స్పిన‍్నర్లుగా మారిపోవడంతో సీనియర్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ను పక్కనపెట్టేశారు. కేవలం టెస్టులకు మాత్రమే పరిమితమైన అశ్విన్‌..  పరిమిత ఓవర్ల క్రికెట్‌ మ్యాచ్‌ ఆడి రెండేళ్లుపైనే అవుతుంది. టెస్టుల్లో సత్తాచాటుతున్నప్పటికీ అశ్విన్‌ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అవసరం లేదన్నట్లే టీమిండియా సెలక్షన్‌ కమిటీ యోచిస్తోంది. ఈ నేపథ్యంలో అశ్విన్‌కు వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ అండగా నిలిచాడు. అసలు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అశ్విన్‌ ఎందుకు పక్కన పెట్టేశారో తెలియడం లేదన్నాడు. అశ్విన్‌కు వన్డే ఫార్మాట్‌, టీ20 ఫార్మాట్‌లో మళ్లీ ఆడే అవకాశం ఇవ్వాలని కోరాడు.

‘ వికెట్‌ టేకర్‌ అయిన అశ్విన్‌కు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఎందుకు చాన్స్‌ ఇవ్వడం లేదు. మళ్లీ అతనికి అవకాశం ఎందుకు ఇచ్చి చూడకూడదు. రెడ్‌ బాల్‌ క్రికెట్‌లో అశ్విన్‌ ఎలా రాణిస్తాడో అంతా చూస్తున్నాం. అశ్విన్‌ అన్ని వైపులా బంతిని స్పిన్‌ చేయడంలో సమర్ధుడు. వాషింగ్టన్‌ సుందర్‌ ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాడు. సుందర్‌ ఒక ప్రతిభా వంతుడే కానీ అతను ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇక కుల్దీప్‌, చహల్‌లు కూడా సమర్థులే. వారిని ప్రతీ గేమ్‌ ఆడించాలి. కాకపోత ఏ కాంబినేషన్‌ ఎలా సెట్‌ అవుతుందో చూసుకుని చహల్‌-కుల్దీప్‌ల్లో ఒకరికి చాన్స్‌ ఇస్తూ ఉండాలి. వారు మనకున్న బెస్ట్‌ ఆప్షన్స్‌. అలానే అశ్విన్‌కు కూడా మరిన్ని అవకాశాలు ఇవ్వాలి’ అని భజ్జీ పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు