ముంబై : టీవీ షోలో మహిళల పట్ల అసభ్యకర వ్యాఖ్యలు చేసి సస్పెన్షన్కు గురైన భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్లపై సీనియర్ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఫైర్ అయ్యాడు. వారితో కలిసి ఒకే టీమ్ బస్సులో ప్రయాణించలేనని, తనతో తన భార్యా, కూతురు ఉంటారని ఘాటుగా వ్యాఖ్యానించాడు. ఇటీవల బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘కాఫీ విత్ కరణ్’ టీవీ షోలో పాండ్యా, రాహుల్లు అశ్లీల రీతిలో మహిళల్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసి సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో భజ్జీ ఇండియా టుడేతో మాట్లాడుతూ.. ‘రేపు పొద్దున ఏ పార్టీలోనైనా వారిని కలిస్తే మీరు మాట్లాడుతారేమో కానీ.. నేను మాత్రం మాట్లాడను. అలాగే ఒకే టీమ్ బస్సులో కూడా నేను వారితో ప్రయాణించలేను. ఎందుకుంటే నాతో నా భార్య, కూతురు ఉంటుంది. హర్దిక్ ప్రతి ఒక్కరి గౌరవాన్ని తీసేలా ప్రవర్తించాడు. జట్టులో మేం ఎప్పుడు ఇలాంటి కల్చర్ను సృష్టించలేదు. అంతగా ఖాళీగా ఉంటే నీకేం కావాలో దానిపై దృష్టి పెట్టాలి. ఖాళీ సమయాల్లో ఏ ఆటగాడు ఏం చేస్తుండో కనిపెట్టాల్సిన అవసరం అవినీతి నిరోధక యూనిట్ (ఏసీయూ)కు ఉంది. ఏమైనా ప్రస్తుతం నిబంధనలు కఠినంగానే ఉన్నాయి. భారత జట్టుకు ఓ గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని ఈ తరహా వ్యాఖ్యలతో వీరు చెడగొట్టారు. క్రికెట్ ఆడే ప్రతి సీనియర్కు, జట్టుకు చెడ్డ పేరు తీసుకొచ్చారు. విరాట్ కోహ్లి కూడా జట్టంతా వారితో కలిసుండాలనుకోవడం లేదని స్పష్టం చేశాడు.’ అని హర్భజన్ పేర్కొన్నారు.
సస్పెన్షన్పై స్పందిస్తూ.. జట్టుతోనే ఉంటే అది సస్పెన్షన్ ఎలా అవుతోంది. సస్పెండ్ అయితే ఇంకా వారు అక్కడే ఎందుకు ఉన్నారని భజ్జీ ప్రశ్నించారు. ఆటగాళ్లు ఈ తరహా నోరు జారకుండా నిబంధనలు కఠినతరం చేయాలన్నారు. కేవలం ఏడాది మాత్రమే భారత జట్టుకు ఆడిన పాండ్యా ఎలా డ్రెస్సింగ్ విషయాలు పంచుకుంటాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను గత 25 ఏళ్ల నుంచి క్రికెట్ ఆడుతున్నానని, ఇతరుల గురించి ఎప్పుడూ మాట్లాడలేదన్నాడు.