‘జడేజాకు అవకాశం ఇవ్వండి’

5 Jul, 2019 15:07 IST|Sakshi

లీడ్స్‌ :  ప్రస్తుత వన్డే వరల్డ్‌కప్‌లో శ్రీలంకతో  భారత్‌ ఆడబోయే చివరి లీగ్‌ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాకు తుది జట్టులో చోటు కల్పించాలని వెటరన్‌ ఆఫ్‌ స్పిన్నర్‌  హర్భజన్‌ సింగ్‌  సూచించాడు. ప్రపంచకప్‌లో టీమిండియా ఇప్పటికే సెమీఫైనల్‌కు దూసుకెళ్లడంతో ఈ ప్రయోగం చేస్తే  బాగుంటుందని పేర్కొన్నాడు. జడేజా మిడిల్‌ ఓవర్లలో తన లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్‌ బౌలింగ్‌ కోటాను సమర్థంగా నిర్వహించడంతో పాటు, డెత్‌ ఓవర్లలో బ్యాట్‌తోనూ పరుగులు సాధించే అవకాశం ఉందని భజ్జీ పేర్కొన్నాడు. 

ప్రపంచకప్‌కు టీమిండియాకు ఎంపికైన 15మంది జాబితాలో రవీంద్ర జడేజాకు చోటు దక్కింది. కానీ ఇప్పటివరకూ ఒక్క మ్యాచ్‌లో కూడా అతనికి ఆడే అవకాశం రాలేదు. అయితే ఇంగ్లడ్‌తో జరిగిన మ్యాచ్‌లో సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డర్‌గా మైదానంలోకి వచ్చిన జడేజా తన మెరుపు పీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు.కొంతకాలంగా టెస్ట్‌ క్రికెట్‌లో జడేజా మంచి ప్రదర్శన ఇస్తూ ఆ ఫార్మాట్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. అయితే 2017 చాంపియన్స్‌ ట్రోఫీ తర్వాత యజువేంద్ర చహాల్‌, కుల్దీప్‌ యాదవ్‌లు తమ ప్రదర్శనతో ఆకట్టుకోవడంతో జడేజాకు చాన్స్‌లు అంతంత మాత్రమే వస్తున్నాయి.  శనివారం శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే 15 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచే అవకాశం ఉంది. అదే సమయంలో  ఆ రోజు జరిగే మరో మ్యాచ్‌లో ఆసీస్‌ను దక్షిణాఫ్రికా ఓడించాల్సి ఉంది. ఒకవేళ ఆసీస్‌ గెలిస్తే ఆ జట్టు 16 పాయింట్లతో టాప్‌ను నిలుపుకుంటుంది.


 

మరిన్ని వార్తలు