‘అతను లేకపోవడం టీమిండియాకు లోటే’

17 Nov, 2018 11:32 IST|Sakshi

సిడ్నీ: గాయం కారణంగా ఆస్ట్రేలియా పర్యటనకు టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా దూరమైన సంగతి తెలిసిందే. ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఆసియాకప్‌లో వెన్నెముక గాయానికి గురైన హార్దిక్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. దీంతో ఆస్ట్రేలియా పర్యటనకు హార్దిక్ పాండ్యాను సెలక్టర్లు ఎంపిక చేయలేదు.

ఈ నేపథ్యంలో ఆసీస్‌తో జరిగిన సిరీస్‌లో అతను జట్టులో లేకపోవడం టీమిండియాపై ప్రభావం చూపే అవకాశముందని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మైక్‌ హస్సీ అన్నాడు. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో భారత్ విజయావకాశాలపై హాస్సీ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ‘హార్దిక్‌లో గొప్ప నైపుణ్యం ఉంది. ఆస్ట్రేలియాలోని పరిస్థితులకు అతని ఆటతీరు అతికినట్టుగా సరిపోయేది.అతని ఆల్‌రౌండ్‌ లక్షణాలతో జట్టుకు సమతూకం తెస్తాడు. కానీ గాయం కారణంగా అతను ఆస్ట్రేలియాతో సిరీస్‌కు దూరమవడం భారత జట్టుపై ప్రభావం చూపే అవకాశం ఉంది’ అని హస్సీ అభిప్రాయపడ్డాడు.

ఆసీస్‌ను ఎదుర్కోవడం ఈజీ కాదు..

‘స్టార్ బ్యాట్స్‌మెన్ స్టీవ్‌స్మిత్, వార్నర్ లేకుండా టెస్ట్ సిరీస్ గెలిచేందుకు భారత్‌కు మంచి అవకాశముంది. కానీ మిచెల్ స్టార్క్‌, హజిల్‌వుడ్, ప్యాట్ కమ్మిన్స్, నాథన్ లియాన్‌తో కూడిన ఆసీస్ బౌలింగ్ బృందాన్ని తొలిసారి ఎదుర్కొవడం టీమిండియాకు యువ బ్యాట్స్‌మెన్‌కు అంత సులువు కాదు. స్వదేశంలో ఆస్ట్రేలియా ఎప్పుడూ ఉత్తమ ఆటతీరే కనబరుస్తుంది. మా జట్టును ఓడించడం అంత సులభం కాదు’ అని అన్నాడు.

మరిన్ని వార్తలు