ఆ స్థానంలో ధోనిని తప్ప మరొకరిని ఊహించుకోలేను

6 Jun, 2020 14:00 IST|Sakshi

ముంబై : ప్రముఖ కామెంటేటర్ హర్ష బోగ్లే హోస్ట్‌గా క్రిక్ బజ్ నిర్వహించిన లైవ్ సెషన్‌లో టీమిండియా విధ్వసంకర ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా పాల్గొన్న విషయం తెలిసిందే. సుదీర్ఘంగా సాగిన ఈ సెషన్‌లో తన టెస్టు కెరీర్‌, నటాషా స్టాన్‌కోవిచ్‌తో ప్రేమాయణం, ‘కాఫీ​ విత్‌ కరణ్‌ షో’ వివాదానికి సంబంధించి అనేక విషయాలపై పాండ్యా చర్చించారు. అయితే ఈ కార్యక్రమం ముగింపులో గల్లీ క్రికెట్‌ జట్టును ఎంపిక చేయాల్సిందిగా పాండ్యాను హర్ష భోగ్లే కోరాడు. అంతేకాకుండా జట్టులో ఎంపిక చేసే ఒక్కో స్థానం కోసం పలు ఆప్షన్స్‌ కూడా ఇచ్చాడు. ఈ క్రమంలో ఓపెనర్‌గా తన తొలి ఛాయిస్‌ వెస్టిండీస్‌ విధ్వంసకర ఆటగాడు క్రిస్‌ గేల్‌ అని తేల్చి చెప్పాడు. (అప్పుడే డేటింగ్‌ మొదలు : హార్దిక్‌)   

ఓపెనర్‌ స్థానం కోసం రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, డికాక్‌, డేవిడ్‌ వార్నర్‌, క్రిస్‌ గేల్‌ పేర్లను హర్ష బోగ్లే సూచించగా గేల్‌ వైపే పాండ్యా మొగ్గుచూపాడు. ఇక మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌గా విరాట్‌ కోహ్లిను ఎంపిక చేశాడు. జట్టులో ఫినిషర్‌ స్థానంలో ఎంఎస్‌ ధోనిని తప్ప మరొకరిని ఊహించుకోలేనని తెలిపాడు. అయితే డివిలియర్స్‌ పేరును భోగ్లే సూచించినప్పటికీ ధోనినే ఎంపిక చేస్తానని స్పష్టం చేశాడు. స్పిన్నర్‌గా తన సోదరుడు కృనాల్‌ను ఎంచుకుంటానని తెలిపాడు. ఇక రవీంద్ర జడేజా, బెన్‌ స్టోక్స్‌, షకీబుల్‌ హసన్‌, డ్వేన్‌ బ్రావోలను పక్కకు పెట్టి ఆల్‌రౌండర్‌ కోటాలో ఆండ్రీ రస్సెల్‌ను జట్టులోకి తీసుకున్నాడు. పేస్‌ బౌలర్‌గా జస్ప్రిత్‌ బుమ్రా తన జట్టులో ఉండాలని పాండ్యా పేర్కొన్నాడు. ఎంతో ఫన్నీగా సాగిన ఈ సెషన్‌ ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. (ఇక టెస్టులు ఆడటం నాకు సవాలే)

మరిన్ని వార్తలు