పాండ్యా ట్వీట్‌కు ధోని ఫ్యాన్స్‌ ఫిదా

8 May, 2019 17:38 IST|Sakshi

హైదరాబాద్: టీమిండియా క్రికెటర్లు ఎంఎస్‌ ధోని, హార్దిక్‌ పాండ్యాల బ్రొమాన్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. క్రీడా, వ్యక్తిగత జీవితంలో ధోనినే తనకు ఆదర్శమంటూ పాండ్యా పలువేదికల్లో ప్రకటించాడు. అంతేకాకుండా సోషల్‌ మీడియా వేదికగా ధోనిపై తనకున్న ప్రేమను, అభిమానాన్ని  అనేకసార్లు చాటుకున్నాడు. ఇక ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ధోని మార్క్‌ హెలికాప్టర్‌ షాట్లతో పాండ్యా సంచలనం సృష్టిస్తున్నాడు. తాజాగా ధోని గురించి పాండ్యా చేసిన ట్వీట్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 

మంగళవారం సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌ అనంతరం పాండ్యా తన ట్విటర్‌లో ధోనితో కలిసి ఉన్న ఫోటోను షేర్‌ చేశాడు. అంతేకాకుండా ‘నా స్ఫూర్తి, నా స్నేహితుడు, నా సోదరుడు, నా లెజెండ్‌ ఈయనే.. మహేంద్ర సింగ్ ధోనీ’ అంటూ పోస్టు చేశాడు. దీంతో పాటు ధోనీ హెలికాప్టర్‌ షాట్లను గుర్తుచేస్తూ హెలికాప్టర్‌ ఎమోజీని పెట్టాడు. ప్రస్తుతం పాండ్యా చేసిన ట్వీట్‌ తెగ వైరల్‌ అవుతోంది. ముఖ్యంగా ధోని అభిమానులు పాండ్యా ట్వీట్‌కు ఫిదా అయ్యారు. ప్రస్తుతం యువ క్రికెటర్‌లకు ధోనినే స్పూర్తి అంటూ అతడి ఫ్యాన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు.

మంగళవారం చెపాక్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌తో తలపడిన మూడు మ్యాచ్‌ల్లోనూ సీఎస్‌కే ఓడిపోయింది. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ నేరుగా ఫైనల్‌కు చేరగా... సీఎస్‌కే మాత్రం క్వాలిఫయర్‌2 ఆడాల్సి వచ్చింది.
 

మరిన్ని వార్తలు