హార్దిక్‌ పాండ్యా ట్వీట్‌లో ఏముందంటే..?

28 Jan, 2019 20:08 IST|Sakshi

మౌంట్‌ మాంగనీ: టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. టీవీషో వివాదం కారణంగా న్యూజిలాండ్‌తో మొదటి రెండు వన్డేలకు దూరమైన అతడు మూడో వన్డేలో చోటు దక్కించుకున్నాడు. అద్భుతంగా రాణించి తనకు దక్కిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని అందరి మెప్పు పొందాడు. టీవీషో వివాదంపై క్షమాపణ చెప్పిన తర్వాత సోషల్‌ మీడియాకు దూరంగా ఉన్న హార్దిక్‌ పాండ్యా ఈరోజు మ్యాచ్‌ ముగిసిన తర్వాత ట్విటర్‌లో పోస్ట్‌ పెట్టాడు. ‘కృతజ్ఞతలు’ అంటూ మూడో వన్డే ఫొటోలు షేర్‌ చేశాడు. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే హార్దిక్‌ 18 రోజుల విరామం తర్వాత ట్వీట్‌ చేయడం గమనార్హం.  

హార్దిక్‌ పాండ్యాపై కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ప్రశంసలు కురిపించాడు. జట్టులోకి మళ్లీ అతడు తిరిగి రావడాన్ని స్వాగతించాడు. బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో బాగా రాణించాడని మెచ్చుకున్నాడు. మాజీ కెప్టెన్‌ సునీల్‌ గావస్కర్‌ కూడా హార్దిక్‌ను పొగడ్తల్లో ముంచెత్తాడు. మూడో వన్డేలో అద్భుతంగా ఆడాడని మెచ్చుకున్నాడు. వివాదాలను మర్చిపోయి మైదానంలో ఆటపై దృష్టి పెట్టడం మామూలు విషయం కాదన్నాడు. దేశం కోసం ఆడుతున్నామన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచించాడు. (ఇక హాయిగా విశ్రమిస్తా: కోహ్లి)

మరిన్ని వార్తలు