డీఎస్పీగా హర్మన్‌ప్రీత్‌

23 Feb, 2018 00:21 IST|Sakshi
హర్మన్‌ప్రీత్‌

చండీగఢ్‌: భారత మహిళా టి20 జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ పంజాబ్‌ పోలీసు శాఖలో చేరేందుకు రంగం సిద్ధమైంది. వచ్చే నెల 1న ఆమె డిప్యూటీ సూపరిటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీఎస్పీ)గా ఉద్యోగ బాధ్యతలు చేపట్టనుంది. రైల్వే ఉద్యోగి అయిన ఆమె ఇదివరకే డీఎస్పీ కావాల్సింది. కానీ తమతో కనీస ఒప్పంద ప్రమాణం (ఐదేళ్ల బాండ్‌) గడువు పూర్తికాకపోవడంతో భారతీయ రైల్వే సంస్థ... ఆమె గతేడాదే రాజీనామా చేసినప్పటికీ రిలీవ్‌ చేయలేదు.

దీంతో పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ స్వయంగా రైల్వే మంత్రిత్వశాఖతో మాట్లాడి ఇంతకుముందు కుదుర్చుకున్న నియామక ఒప్పందాన్ని సడలించి రిలీవ్‌ చేయాలని కోరారు. దీనికి స్పందించిన రైల్వే శాఖ తాజాగా హర్మన్‌ప్రీత్‌ను రిలీవ్‌ చేయడంతో త్వరలోనే డీఎస్పీ కానుంది. ఈ సందర్భంగా పంజాబ్‌ సీఎం అమరీందర్‌ కేంద్ర రైల్వే మంత్రి పీయూష్‌ గోయెల్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తమ రాష్ట్ర పోలీస్‌ శాఖలో చేరనున్న హర్మన్‌కు శుభాకాంక్షలు చెప్పారు. ప్రస్తుతం ఆమె దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సిరీస్‌లో పాల్గొంటోంది.    

మరిన్ని వార్తలు