ఇది సరిపోదు: హర్మన్‌ ప్రీత్‌

16 Nov, 2018 09:33 IST|Sakshi
వికెట్‌ తీసిన ఆనందంలో హర్మన్‌ ప్రీత్‌, రాధ యాదవ్‌

ప్రావిడెన్స్‌ : సెమీస్‌కెళ్లడం సంతోషంగా ఉందని, కానీ టైటిల్‌ నెగ్గాలంటే ఇంకా మెరుగవ్వాలని భారత మహిళా సారథి హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ అభిప్రాయపడ్డారు. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా గురువారం ఐర్లాండ్‌ మహిళలతో జరిగిన మ్యాచ్‌లో హర్మన్‌సేన 52 పరుగులతో గెలిచి సెమీస్‌ బెర్త్‌ను ఖాయం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విజయానంతరం హర్మన్‌ ప్రీత్‌ మాట్లాడుతూ.. ‘ సెమీస్‌కు అర్హత సాధించడం చాలా సంతోషంగా ఉంది. కానీ మేం చాలా మెరుగవ్వాలి. ఈ పొట్టి క్రికెట్‌లో ఒక్కోసారి ప్రధాన బౌలర్లు విఫలమైనప్పుడు.. ఇతరులు ఆ బాధ్యతను తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో నేను జెమ్మీ (జెమీమా రోడ్రిగ్స్‌) బౌలింగ్‌ చేశాం. మేం టైటిల్‌ నెగ్గాలంటే మా ఫీల్డింగ్‌ ఇంకా చురుకుగా ఉండాలి. ఈ రోజు మా ప్రణాళికబద్దంగా మా బ్యాటింగ్‌, బౌలింగ్‌ కొనసాగలేదు. వీటిని మెరుగుపరుచుకొని బరిలోకి దిగుతాం’ అని పేర్కొంది.

ఇక ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌ దిగిన భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ మిథాలీ రాజ్‌ (56 బంతుల్లో 51; 4 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ శతకానికి తోడు స్మృతి మంధాన (29 బంతుల్లో 33; 4 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించింది. కింబర్లీ గార్త్‌ (2/22) కట్టడి చేసింది. ఛేదనలో రాధ యాదవ్‌ (3/25), దీప్తి శర్మ (2/15) పొదుపైన బౌలింగ్‌తో ఐర్లాండ్‌ 8 వికెట్లు కోల్పోయి 93 పరుగులే చేయగలిగింది. ఇసొబెల్‌ జాయ్సే (33) టాప్‌ స్కోరర్‌. ఇక మిథాలీకి ఈ టోర్నీలో ఇది రెండో హాఫ్‌ సెంచరీకావడం విశేషం.  శనివారం జరిగే చివరి లీగ్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో భారత్‌ తలపడుతుంది. 

రోహిత్‌ రికార్డు బ్రేక్‌ చేసిన మిథాలీ

చదవండి: హర్మన్‌ హరికేన్‌ చూశారా?

మరిన్ని వార్తలు