బాబోయ్‌... ఈ ఆవులు మాకొద్దు

7 Jan, 2018 01:49 IST|Sakshi

ప్రభుత్వానికి తిరిగిచ్చిన హరియాణా మహిళా బాక్సర్లు  

రోహ్‌తక్‌: ప్రపంచ యూత్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణాలు గెలిచినందుకు ప్రోత్సాహకంగా రాష్ట్ర ప్రభుత్వం తమకు ఇచ్చిన ఆవులను హరియాణా మహిళా బాక్సర్లు తిరిగి ఇచ్చేశారు. శారీరక పుష్టి కోసం ఆవు పాలు తాగితే మంచిదనే ఉద్దేశంతో బాక్సర్లు జ్యోతి గులియా, సాక్షి చౌదరి, నీతు గాంగాస్‌లకు తలా ఓ ఆవు ఇచ్చారు. ఆ ఆవులు పాలు ఇవ్వకపోగా తమని కుమ్మేస్తున్నాయని, గాయపరుస్తున్నాయని ఆ ముగ్గురు వాపోయారు. దీంతో గత నవంబర్‌లో ప్రభుత్వం ఇచ్చిన ఆవుల్ని తిరిగి అప్పగించారు.

‘మా అమ్మ ఐదు రోజులపాటు ఆవుకు మేత పెట్టారు. అయితే పాలు పితికేందుకు ప్రయత్నించిన మూడుసార్లూ ఆమెను ఆవు తన్నింది. దీంతో మా అమ్మ నడుం దెబ్బతింది. మా వద్ద ఉన్న గేదెలు చాలు అని సంతృప్తి పడుతూ వెంటనే మేము ఆవును తిరిగి ఇచ్చేశాం’ అని ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 51 కేజీల విభాగంలో స్వర్ణం గెలిచి జ్యోతి గులియా తెలిపింది. ఇతర బాక్సర్లు నీతు, సాక్షిలకు కూడా ఇలాంటి పరిస్థితే తలెత్తడంతో వారూ ఆవులను తిరిగిచ్చేశారు. 

మరిన్ని వార్తలు